- నిబంధనలు ఉల్లంఘించారని విమర్శలు
విశాఖపట్టణం,ఏప్రిల్ 17 : ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ.. వైజాగ్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రారంభించారు. తాను కూడా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో విజయసాయిరెడ్డి కరోనా నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో లాక్డౌన్ అమలులో ఉన్న కారణంగా రక్తదాన శిబిరాలనుద్దేశించి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ నెల 14న ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రక్తదాన శిబిరాలపై నిషేధం విధిస్తున్నట్టుగా ప్రకటనలో పేర్కొంది. అయితే తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడే వారిని దృష్టిలో పెట్టుకుని నిబంధనల్లో కొన్ని సడలింపులు చేసింది.
రోగుల రక్తమార్పిడి, చికిత్స, సేవల కొరకు సంబంధిత ఆసుపత్రులకు వెళ్లడానికి వీలుగా ఆ సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డులను, రక్తమార్పిడి అవసరాన్ని తెలిపే ఆధారాలను పోలీసులకు చూపించి అనుమతి తీసుకోవాలని తెలిపింది. రెగ్యులర్గా ఆసుపత్రులను సందర్శించే వీలుగా పాస్లను జారీ చేస్తారని ప్రకటించింది. ఆ తర్వాతే రక్తదానం చేయాలి. ఈ నిబంధనను అస్సలు పట్టించుకోలేదు. ఇక రక్తదాన శిబిరంలోనూ భౌతిక దూరం పాటించే విషయాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. విజయసాయిరెడ్డి రక్తదానం చేస్తుంటే వైసీపీ నేతలు ఆయన చుట్టూ చేరి గుంపుగా నిల్చున్నారు. దీనికి తోడు వైద్య సిబ్బంది సాధారణ మాస్కులు ధరిస్తే.. విజయసాయిరెడ్డి, ఇతర వైసీపీ నేతలు ఎన్-95 మాస్కులు ధరించి ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ డియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా ఈ విధంగా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు ఇలా నిబంధనలకు తూట్లు పొడిస్తే ఎలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.