- 3-0తో సీరిస్ కైవసం చేసుకున్న రోహిత్ సేన
- వన్డేలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా రికార్డు
తిరువనంతపురం, జనవరి 16 : శ్రీలంకతో జరిగిన చివరి వన్డే మ్యాచ్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీల సూపర్ ఇన్నింగ్స్తో భారత్ 390 పరుగులు చేసింది. 391 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకను భారత బౌలర్లు 73 రన్స్కే ఆలౌట్ చేశారు. దీంతో 317 పరుగుల భారీ తేడాతో గెలిచి.. అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించింది. ఈ రికార్డ్ ఇప్పటివరకు న్యూజిలాంగ్ పేరిట ఉండేది. ఐర్లాండ్పై న్యూజిలాండ్ 290 రన్స్ తేడాతో గెలిచింది. ఆ రికార్డ్ను భారత్ ఇప్పుడు అధిగమించింది. మూడో వన్డేలో భారత జట్టు భారీ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 390 పరుగుల భారీ స్కోరు చేసింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంక తో ఇక్కడి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ మైదానంలో జరిగిన మ్యాచ్లో శ్రీలంక చిత్తుగా ఓడింది. భారత్ నిర్దేశించిన 391 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 73 పరుగులకే కుప్పకూలింది.
ఫలితంగా 317 పరుగుల భారీ తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. శుభమన్ గిల్ (116), కోహ్లీ (166 నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన లంక ఆది నుంచే తడబడింది. శ్రీలంక బ్యాటర్లను హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ తొలుత చావుదెబ్బ కొట్టాడు. వరుసపెట్టి వికెట్లు తీస్తూ టాపార్డర్ను పెవిలియన్ పంపాడు. అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ (42), శుభమన్ గిల్ (116) కలిసి భారత్ జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు.
ఇద్దరూ కలిసి తొలి వికెట్కు 95 పరుగులు జోడించి పునాది వేశారు. రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వొచ్చిన విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకున్నంత వరకు నిదానంగా ఆడి ఆ తర్వాత బ్యాట్తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో వన్డేల్లో 46వ వన్డే పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 166 పరుగులు చేశాడు. మరోవైపు, శుభమన్ గిల్ కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 116 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 38 పరుగులు చేశాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇండియా 317 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడిచింది.