Take a fresh look at your lifestyle.

ఆర్థిక సంక్షోభంలో కుదేలవుతున్న శ్రీలంక – భారత్‌ ఆపన్నహస్తం

“నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి నెలకొంది. పాలపొడి నుంచి పెట్రోల్‌ ‌వరకు పెరిగిన రేట్లు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్‌ ‌బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అక్కడ లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర 283 రూపాయలకు చేరుకోగా, డీజిల్‌ ‌ధర రూ.220కి చేరుకుంది. వంట గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర ఏకంగా రూ.1,359 చేరుకుంది. వంట గ్యాస్‌ ‌కొరతతో చాలా హోటళ్లు మూతపడ్డాయి. గ్యాస్‌ ‌ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు కిరోసిన్‌ ‌వాడుతున్నారు. ముడిచమురు నిల్వలు అయిపోయిన తర్వాత శ్రీలంక తన ఏకైక ఇంధన శుద్ధి కర్మాగారంలో కార్యకలాపాలను నిలిపివేసినట్లు పెట్రోలియం జనరల్‌ ఎం‌ప్లాయీస్‌ ‌యూనియన్‌ ‌ప్రకటించింది. ఇక కోడి గుడ్డు ధర 35, కిలో చికెన్‌ 1000, ‌కిలో ఉల్లి ధర 200 నుంచి 250, కేజీ పాలపొడి ప్యాకెట్‌ ‌ధర 1945, లీటర్‌ ‌కొబ్బరి నూనె 900, టీ ధర 100,కు చేరుకున్నాయి.”

శ్రీలంకలో ఆహార,ఆర్థిక సంక్షోభం రోజురోజుకు పెరిగిపోతోంది. రూపాయి విలువ నానాటికీ పడిపోతోంది.విదేశీ అప్పులు ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి నెలకొంది. పాలపొడి నుంచి పెట్రోల్‌ ‌వరకు పెరిగిన రేట్లు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్‌ ‌బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అక్కడ లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర 283 రూపాయలకు చేరుకోగా, డీజిల్‌ ‌ధర రూ.220కి చేరుకుంది. వంట గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర ఏకంగా రూ.1,359 చేరుకుంది. వంట గ్యాస్‌ ‌కొరతతో చాలా హోటళ్లు మూతపడ్డాయి. గ్యాస్‌ ‌ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు కిరోసిన్‌ ‌వాడుతున్నారు. ముడిచమురు నిల్వలు అయిపోయిన తర్వాత శ్రీలంక తన ఏకైక ఇంధన శుద్ధి కర్మాగారంలో కార్యకలాపాలను నిలిపివేసినట్లు పెట్రోలియం జనరల్‌ ఎం‌ప్లాయీస్‌ ‌యూనియన్‌ ‌ప్రకటించింది. ఇక కోడి గుడ్డు ధర 35, కిలో చికెన్‌ 1000, ‌కిలో ఉల్లి ధర 200 నుంచి 250, కేజీ పాలపొడి ప్యాకెట్‌ ‌ధర 1945, లీటర్‌ ‌కొబ్బరి నూనె 900, టీ ధర 100,కు చేరుకున్నాయి. పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌కోసం క్యూలైన్‌లో నిలుచుని కొంతమంది వ్యక్తులు మృతి చెందారు. లంకేయులు విద్యుత్‌ ‌కొరతను సైతం ఎదుర్కొంటున్నారు. ప్రతీ రోజూ కొన్ని గంటల పాటు కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నారు.

పడకేసిన టూరిజం
టూరిజం పడకేయడంతో నిరుద్యోగ సమస్య పెరిగింది. కోవిడ్‌ ‌మరియు బాంబు దాడుల వల్ల విదేశీ యాత్రికుల రాక తగ్గింది. దీంతో గణనీయంగా శ్రీలంక రాబడి తగ్గింది. ఆర్గానిక్‌ ‌ఫార్మింగ్‌ ‌కారణంగా పంటల దిగుబడులు తగ్గాయి. దీంతో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. బియ్యం, పంచదార, పప్పులు, మందులు లాంటి అవసరాల కోసం శ్రీలంక దిగుమతులపై ఆధారపడుతుంది. కానీ విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోవడంతో.. దిగుమతులకు కూడా వీలులేకుండా పోయింది.

విఫలమైన సేంద్రియ వ్యవసాయం
రాజపక్స నియంత పాలనతో.. రైతులను సంసిద్ధం చేయకుండా.. ఏకపక్షంగా దేశమంతటా సేంద్రియ వ్యవసాయాన్ని అమల్లోకి తేవడం శాపమైంది. పంటలు దెబ్బతిని.. దిగుబడులు మూడో వంతు కంటే తక్కువకు పడిపోవడంతో ఆహార కొరత తీవ్రమైంది. ప్రజలకు తినడానికి తిండి లేదు. కొందామంటే డబ్బు లేదు. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. సేంద్రియ సాగు ఎలా చేయాలో రైతులకు అవగాహన కల్పించకుండా గత ఏడాది నూరు శాతం సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని ప్రధాని మహీంద్ర రాజపక్స ఏకపక్షంగా నిర్ణయించారు. కీలకమైన రసాయన ఎరువుల దిగుమతులను నిషేధించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు సంఘాలు హెచ్చరించినా వినలేదు.

భారత్‌ ‌కు తరలుతున్న శ్రీలంక శరణార్థులు
పరిస్థితులు నానాటికీ తీసికట్టుగా మారడంతో లంక తమిళులు భారత్‌ ‌వైపు మల్లుతున్నారు. తమిళనాడు తీరం రామేశ్వరం, ధనుష్కోటిలకు లంక తమిళులు వస్తున్నారు. ఇప్పటికే ఇలా వచ్చిన కొంత మందిని కోస్ట్ ‌గార్డ్ అదుపులోకి తీసుకుంది. శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం ఇలాగే కొనసాగితే.. మరింత మంది లంక తమిళులు.. భారత్‌కు శరణార్థులుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

చైనాతో దోస్తీ, పెరిగిన అప్పులు:
శ్రీలంక ఆర్థిక కష్టాలకు బీజం 2007లో పడింది. అప్పట్లో శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్న మహీంద రాజపక్స తీసుకున్న నిర్ణయాలు ఇప్పటి దుస్థితికి ప్రధాన కారణమయ్యాయి. అప్పులు తీసుకోవడానికి వీలుగా రాజపక్స ప్రభుత్వ బాండ్లను మార్కెట్లలో విక్రయానికి ఉంచారు. ఇలా తీసుకున్న రుణాలే ఇప్పుడు శ్రీలంక అప్పుల్లో 38 శాతంగా ఉన్నాయి. మహీంద రాజపక్స చైనాకు విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చారు. కానీ చైనా నుంచి తీసుకున్న రుణాలే శ్రీలంకను అప్పుల ఊబిలోకి నెట్టాయి. దీంతో అప్పులు తీర్చడం కోసం మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. చివరికి డబ్బులు తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో హంబన్‌టోట పోర్టును చైనాకు 99 ఏళ్లకు లీజుకు ఇవ్వాల్సి వచ్చింది.మహీంద రాజపక్స అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో శ్రీలంకలోని ప్రధాన ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ ‌ప్రాజెక్టులన్నీ చైనావే. 2005 నుంచి 2015 మధ్య శ్రీలంకకు చైనా 14 బిలియన్‌ ‌డాలర్ల రుణం అందించింది. రాజపక్సతో ఉన్న సంబంధాల నేపథ్యంలో 2015 ఎన్నికల్లో రాజపక్స విజయం కోసం చైనా భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేసిందని చెబుతారు. కానీ ఆ ఎన్నికల్లో రాజపక్స ఓడిపోయారు. మళ్లీ 2019లో అధికారంలోకి వచ్చారు. గత మూడేళ్లలో లంక ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది.

భారత్‌ ‌చేయుత
శ్రీలంకలో మారకద్రవ్యం భారీ పతనాన్ని ఎదుర్కొంటోంది. దిగుమతుల కోసం చెల్లించడానికి దేశానికి ఈ సంవత్సరం 22 బిలియన్‌ ‌డాలర్లు అవసరం. అయితే దాని ఆదాయం మాత్రం 12 బిలియన్‌ ‌డాలర్లుగా అంచనా వేశారు. 10 బిలియన్‌ ‌డాలర్ల లోటులో శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది. భారత్‌ – ‌శ్రీలంక మధ్య సంబంధాలు ఒకప్పటిలా లేనప్పటికీ.. ద్వీప దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు భారత్‌ ఈ ‌వారం 1 బిలియన్‌ ‌డాలర్ల సాయాన్ని ప్రకటించింది. ఆహారం, మందులు, ఇతర అవసరమైన వస్తువుల దిగుమతి కోసం స్టేట్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. భారత్‌ ఇప్పటికే 1.5 బిలియన్‌ ‌డాలర్ల సాయంను అందిచడంతోపాటు 400 మిలియన్‌ ‌డాలర్ల కరెన్సీ స్వాప్‌ ‌సాయాన్ని ప్రకటించింది.

భారత్‌ ‌తో స్నేహబంధం శ్రీలంక కు మేలు
ఈ క్రమంలో భారతదేశం సేవలను శ్రీలంక గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ మహాసముద్రం ప్రస్తుతం చైనా వివాదాస్పద ప్రాంతంగా మారింది. అయితే.. చైనా మైత్రి కంటే.. భారత్‌ ‌బంధమే బలమైనదని శ్రీలంక గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.శ్రీలంకలో పరిస్థితులు త్వరలోనే సద్దుమణిగి తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశిద్దాం.

పిన్నింటి బాలాజీ రావు హనుమకొండ.
9866776286

Leave a Reply