- ఉద్యాన పంటలకు అపారమైన అవకాశాలు
- సబ్సిడీలు, ఇతర అవకాశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం
- హార్టికల్చర్ యూనివర్సిటి స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళి సై
భారతదేశంలో హార్టికల్చర్ అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రపంచంలోనే భారతదేశం హార్టికల్చర్ హబ్గా ఎదుగుతున్నదని, ‘ప్రపంచ పండ్లు, కూరగాయల బాస్కెట్’గా గుర్తింపు పొందుతున్నదని డాక్టర్ తమిళిసై అన్నారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ యూనివర్శిటీ ఛాన్సలర్ హోదాలో స్నాతకోత్సవ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశంలో రైతుల ఆదాయం రెండింతలు కావాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే హార్టికల్చర్ ప్రధాన పాత్ర పోషిస్తుందని గవర్నర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన పంటలను పెంపొందించడానికి సబ్సిడీలు, ఇతర అవకాశాలను కల్పిస్తున్నదని చెప్పారు. పాలి హౌసులు, కిచెన్ గార్డెన్లు, రూఫ్ గార్డెన్లు ఇతర పద్ధతుల ద్వారా హార్టికల్చర్కి మంచి ప్రోత్సాహకాలు అందుతున్న ప్రస్తుత సమయంలో రైతులు, ఇతర ఎంటర్ప్రెన్యూర్లు ఈ అవకాశాలను వినియోగించుకొని రాష్ట్రంలో హార్టికల్చర్కి మరింత ఊపు తీసుకురావాలని డాక్టర్ తమిళిసై పిలుపునిచ్చారు.
పట్టాలు అందుకుంటున్న విద్యార్థులు, పరిశోధకులు తమ చదువును, విజ్ఞానాన్ని, నైపుణ్యాలను రాష్ట్రంలో, దేశంలో హార్టి కల్చర్ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని గవర్నర్ సూచించారు. ప్రజలు కూడా తమ ఇళ్లలో కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్లు పెంపొందించుకోవాలని అన్నారు. తమకు అందుబాటులో ఉన్న అన్ని స్థలాలలో కూడా కూరగాయలు, పండ్లు, పూల మొక్కల పెంపకం చేపట్టాలని పిలుపునిచ్చారు. రాజ్ భవన్లో తాము చేపట్టిన పండ్ల మొక్కల పెంపకం ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నదని, ఇది తనకు ఎంతో సంతోషదాయకంగా ఉందని ఆమె అన్నారు. కోవిడ్ సంక్షోభం, ప్రకృతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను అలాగే పండ్లు కూరగాయలు లాంటి బలవర్ధకమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొని రోగనిరోధకశక్తిని పెంచుకోవాల్సిన అవసరాన్ని చాటిచెప్పింద న్నారు.