డాలరుతో రూపాయి విలువ క్షీణించడం, అంతర్జాతీయంగా ధరలు పెరుగుదలతో బంగారం ధర భారీగా పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్స్ బంగారం ధర ఒక్కరోజే రూ.953 పెరిగి రూ.44,472కి చేరింది. గత ట్రేడింగ్ సెషన్లో దీని ధర రూ.43,519గా ఉంది. వెండి ధర సైతం భారీగా పెరిగింది. గత ట్రేడింగ్లో రూ.49,404గా ఉన్న ధర రూ.586 పెరిగి రూ.49,990కు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్సు బంగారం ధర గరిష్ఠంగా 1682 డాలర్లకు చేరింది.
అదే సమయంలో వెండి ఔన్సు ధర కూడా 18.80 డాలర్లకు పెరిగింది. దీనికి తోడు డాలరుతో రూపాయి
మారకం విలువ క్షీణించడం బంగారం ధరలు పెరుగుదలకు కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ పేర్కొన్నారు. ఒక్క సోమవారం రోజే రూపాయి మారకం విలువ 22 పైసలు మేర క్షీణించింది. దీనికి తోడు కరోనా వైరస్ ప్రభావం చైనా వెలుపలి దేశాలైన దక్షిణ కొరియా, మధ్య ఆసియా, ఇటలీ దేశాల్లో కనిపించడం, అక్కడ మరణాలు సంభవిస్తుండడంతో బంగారం ధరల పెరుగుదలకు మరో కారణమని పటేల్ తెలిపారు.