- ఉద్యోగుల్లోనూ కొరోనా కలవరం
- జిల్లాల్లోనూ మొదలైన ఆందోళన
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అన్ని శాఖల ఉద్యోగులను కరోనా కలవర పరుస్తోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదువుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో కరోనా విరుచుకుపడుతోంది. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో ఇద్దరు ప్రొఫెసర్లు, ఆస్పత్తిలోని పరిపాలనా సిబ్బందికి పాజిటీవ్గా తేలింది. జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో మేయర్ పేషీ అటెండర్కు వైరస్ నిర్దారణ అయింది. మేయర్ బొంతు రామ్మోహన్ సైతం కార్యాలయానికి వచ్చారు. దీంతో మేయర్ పేషీ ఉద్యోగులు 14 రోజులు •ం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ఖైరతాబాత్, రాజేంద్రనగర్ సర్కిళ్లలో ముగ్గురికి, అంబర్ పేట ఠాణా పరిధిలో 8 కేసులు నమోదయ్యాయి. మలక్ పేటలోని వేర్వేరు ప్రాంతాల్లో 8 మంది వైరస్కు గురయ్యారు. ఓ వైద్యాధికారిణికి పాజిటీవ్గా తేలింది. ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్న ఆమె భర్తకు సోకింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఓ వ్యాపారికి పాజిటీవ్ వచ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పోలీసులకు
కరోనా నిర్దారణ అయింది.
వ్యాపారి విందులో ఇద్దరికి కొరోనా పాజిటివ్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ వ్యాపారి గెట్ టు గెదర్ పార్టీ ఆ కుటుంబంలో ఆందోళనకు గురిచేసింది. వ్యాపారి ఇచ్చిన విందు కార్యక్రమానికి ఇతర ప్రాంతాల నుంచి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. కాగా వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. ఒకరు ఆర్ముర్ వ్యక్తి కాగా మరొకరు మెదక్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో వ్యాపారి కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముందస్తు చర్యగా పరీక్షల కోసం ఇద్దరు కుటుంబ సభ్యులు హైదరాబాద్కు వెళ్లారు. మరో నలుగురు •ం క్వారంటైన్లోకి వెళ్లారు. ప్రైమరీ కాంటాక్టులపై అధికారులు విచారణ చేస్తున్నారు.
తొమ్మిదో తరగతి విద్యార్థికి కరోనా
సిద్దిపేట జిల్లాలో మరోసారి కరోనా కేసులు కలకలం సృష్టించాయి. మిరుదొడ్డి మండల పరిధిలోని
జంగంపల్లి గ్రామానికి చెందిన జెడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి అఖిల్ గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇరవై రోజుల నుంచి హైదరాబాద్ లోని ఎంఎన్ జే క్యాన్సర్ దవాఖానాలో చికిత్స పొందుతున్నాడు. అఖిల్ కు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకిందని మిరుదొడ్డి, భూంపల్లి దవాఖాన వైద్యాధికారి మల్లికార్జున్ వెల్లడించారు.
కానిస్టేబుల్కు పాజిటివ్
ఉమ్మడి వరంగల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏటూరునాగారం మండలం గోగుపల్లి శివాపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ నర్సింగరావుకు కరోనా ఉన్నట్లు తేలింది. హైదరాబాద్ 16వ బెటాలియన్లో నర్సింగరావు విధులు నిర్వహిస్తున్నారు. అలాగే వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటకు చెందిన షకీల్కు కరోనా పాజిటివ్ఉన్నట్లు తేలింది. ఎంజీఎంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎంజీఎంలో మొత్తం నాలుగు యాక్టివ్ కేసులకు చికిత్స అందిస్తున్నారు.