- విదర్భ నుంచి ఉపరితల ఆవర్తనం
- మరో మూడు రోజులుంటాయన్న వాతావరణ అధికారులు
రాష్ట్రవ్యాప్తంగా గురువారం వడగళ్ల వాన కురిసింది. పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలలో కురిసిన వడగళ్ల వానతో ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అలాగే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని చాలా చోట్ల వడగళ్ల వాన కురిసింది. దీంతో కొన్నిచోట్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
గత కొద్ది రోజులుగా వేసవి తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ అకాల వర్షాలు కాస్తంత ఉపశమనాన్ని కలిగించాయి. అయితే, ఈ అకాల వర్షాల కారణంగా మామిడి, మిర్చి పంటలకు అధిక నష్టం కలిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా క్యుములోనింబస్ మేఘాల కారణంగా గురువారం కురిసిన వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.