- ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు
- రూ. 5 వందలకే గ్యాస్ సిలిండర్
- పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి
- హాత్ సే హాత్ జోడో యాత్రలో గ్రామస్థులతో మమేకం
పాలకుర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : రాష్ట్రంలో వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఒకే విడతలో రైతులందరికీ రూ. 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇస్తామని, ప్రతి ఇంటికి రూ. 5 వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని స్పష్టం చేశారు. బుధవారం హత్ సే హత్ జోడో యాత్రను పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండల కేంద్రంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మాజీ జిల్లా చైర్పర్సన్ ధనవంతి డాక్టర్ లక్ష్మీనారాయణా ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్తో కలిసి రేవంత్ రెడ్డి పాదయాత్ర ధర్మాపురము మైలారం విసునూర్ మీదుగా పాలకుర్తి వరకు పాదయాత్ర కొనసాగింది.
ఈ పాదయాత్రలో గ్రామాలలో మహిళలు డప్పు చప్పులతో మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. మహిళలంతా పాదయాత్రలో రేవంత్ రెడ్డి వెనుక నడిచారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్లలో ఉన్న ప్రజలను పలకరిస్తూ వారి యోగక్షేమాలను ఈ ప్రభుత్వం చేస్తున్న పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. దేవరుప్పల గ్రామంలో లొడంగి కొండయ్య ఇంటి వద్ద భోజనం చేస్తుండగా అతని వద్దకు వెళ్లి కూర్చుని ఆయన యోగక్షేమములను అడిగి తెలుసుకున్నారు. లోడంగి హరితతో మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ కాలేదన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన వొచ్చిన వెంటనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఒకే విడతలో రైతుల రుణమాఫీ చేస్తామన్నారు. అందుకు కాంగ్రెస్ పార్టీకి వోటు వేసి గెలిపించాలని వారిని కోరారు. అనంతరం ఆకుల లక్ష్మయ్య గౌడ్, కారు పోతుల రాములు తాడిచెట్టు వద్ద ఉండడంతో అక్కడికి వెళ్లి గీత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చిన వెంటనే గీత కార్మికులకు నూతన పాలసీ విధానాన్ని తీసుకువచ్చి మోపెడ్లు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం పత్తి చేనులో పత్తి ఏరుతున్న కూలీలతో మాట్లాడారు. తోటకూర భద్రమ్మ, తోటకూర సోమలింగం, కారు పోతుల భద్రమ్మలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూలీలు గత కాంగ్రెస్ పాలనలో పేదోళ్లకు కొంత న్యాయం జరిగేదని వివరించారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. అప్పుడే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇండ్లు వొచ్చాయా అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. గత పాలనలో ఇచ్చిన ఇండ్లలోనే కొంతమంది జీవిస్తున్నామన్నారు. మా కొడుకులకు ఇల్లు లేక బాధపడుతున్నామని వారు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇంటి స్థలం ఉన్న ప్రతివారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
అనంతరం ధర్మపురం శివారులోని రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సేవలాల్ సయంతి కార్యక్రమంలో పాల్గొని బంజారా మహిళలతో సాంప్రదాయ దుస్తులను ధరించి ఆటపాటల్లో పాల్గొని వారిని ఉత్తేజపరిచారు. ధర్మపురం గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లో ఇండ్లను పరిశీలించారు. ఇంటి నలుమూలలు తిరిగి ఇంటి పైకి వెళ్లి గోడలను పరిశీలించి నాణ్యత లోపంతో నిర్మాణం చేయడం వలన త్వరలోనే కూలిపోయే విధంగా ఉన్నాయని ఆరోపించారు. పేద లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల పార్టీ అధ్యక్షులు కుమార్, మేడ ఎల్లయ్య భూక్య, సజ్జన్ హమ్యా, రామ్ రెడ్డి భాస్కరాచారి, రాంబాబు పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు, ఆయా గ్రామాల ముఖ్య నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు.