Take a fresh look at your lifestyle.

ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టిటిడి

తిరుమల, సెప్టెంబర్‌ 6 : ‌తిరుమలలో రెండేళ్ల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలను మాడ వీధుల్లో నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 5‌వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతంలో రెండు బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి బ్రహ్మోత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉంది. దీంతో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్‌ ‌దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్ ‌దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

ఆర్జిత సేవలు, రూ.300 దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్ట్ ‌దాతలు, ఇతర ట్రస్ట్‌ల దాతలకు దర్శన టికెట్లను రద్దు చేసింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్‌ ‌వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ ‌దర్శనం ఉంటుంది. గదులకు సంబంధించి 50 శాతం ఆన్‌లైన్‌లో భక్తులు బుక్‌ ‌చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. మిగిలిన గదులను ఆఫ్‌లైన్‌లో తిరుమలలోని వివిధ కౌంటర్ల ద్వారా భక్తులకు కేటాయిస్తారు. అక్టోబర్‌ ఒకటో తేదీన గరుడసేవ కారణంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రస్ట్‌ల దాతలకు, కాటేజీ దాతలకు సెప్టెంబర్‌ 30 ‌నుంచి అక్టోబర్‌ ‌రెండో తేదీ వరకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో గదుల కేటాయింపును నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది.

Leave a Reply