- అయినవారికి చుట్టం.. కాని వారికి చట్టం
- రాష్ట్రంలో పోలీసుల పాలన సాగుతుంది..
- ముగ్గురు మృతికి కారణమైన న్యాయవాదిపై చర్యలేవి?
జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : చట్టసభల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అయిన వారికి చట్టం చుట్టంలాగా మారిపోతుందని, కానీ వారికి మాత్రం చట్టం కోరలు చాస్తుందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసుల పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. మెదక్ జిల్లాలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి లాకప్ డెత్కు కారణమైన నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాత విచారణ కోసం సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని కోరారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం చెల్లించాలని అన్నారు. నేర విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ ప్రయోగం మానవ హక్కుల ఉల్లంఘననే అని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పాలన పారదర్శకంగా సాగుతుందని భావిస్తే అందుకు భిన్నంగా పోలీసుల అదుపులో పాలన సాగుతుందని విమర్శించారు.
చట్టసభల్లో ప్రజా సమస్యల పై నిలదీస్తే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల దగ్గరికి వెళ్దామంటే పోలీసుల అనుమతి నిరాకరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితేనే మనుగడ సాగే దుస్థితి నెలకొందని ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తి పోశారు. మహబూబాబాద్లో వైఎస్ఆర్టిపి అధినేత్రి షర్మిల హైకోర్టు నుండి అనుమతి పొందినా కూడా కేవలం స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడారనే నెపంతో అరెస్టు చేయడం దారుణం అన్నారు. పోలీసుల చర్యలను ప్రజాస్వామ్య వాదులు ఖండించాలన్నారు. నేర విచారణలో సాంకేతిక ఆధునిక విజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ మెదక్లో ఖదీర్ ఖాన్పై థర్డ్ డిగ్రీ ఉపయోగించడం మానవ హక్కుల ఉల్లంఘననే అన్నారు. సుప్రీమ్ కోర్టు ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల నిఘాలోననే విచారణ చేపట్టాలని తీర్పు చెప్పినా అమలుకు నోచుకోవడం లేదన్నారు.
ఖదీర్ ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకునేటప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని, అతని మృతి అనంతరం పోస్ట్ మార్టం రిపోర్టులో కిడ్నీలు దెబ్బతిన్నాయని స్పష్టంగా తేలిందన్నారు. పోలీసులు నేర విచారణ పేరుతో ఐదు రోజులుగా లాక్ అప్లో ఉంచుకొని తప్పును కప్పిపుచ్చుకునేందుకు తహసిల్దార్ ఎదుట బైండ్ఓవర్ చేశారని ధ్వజమెత్తారు. లాకప్ డెత్కు కారణమైన పోలీసులను శాఖ పరమైన చర్యలు తీసుకోవడంపై డీజీపీని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభినందించారు. కేవలం శాఖ పరమైన చర్యలే కాకుండా ఖదీర్ ఖాన్ మృతికి కారణమైన పోలీసులపై 302 ఐపిసి పార్ట్ 2 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారనడానికి సస్పెన్షన్ కూడా ఒక అధారమన్నారు. తక్షణమే పోలీసులపై కేసు నమోదు చేయాలనీ కాంగ్రెస్ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఒకే రకమైన కేసులో పోలీసులు రెండు విధాలుగా వ్యవహరిస్తున్న తీరును ఎమ్మెల్సీ తప్పుపట్టారు. ఖదీర్ ఖాన్ విషయంలో పోలీసులు ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ విచారణ పేరుతో ఐదు రోజులు లాకప్లో నిర్బంధించారని, అదే జగిత్యాల జిల్లా నర్సింగాపూర్లో ముగ్గురు మృతి చెందడానికి కారణమైన వ్యక్తిపై ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. సూసైడ్ నోట్లో పేరు వున్నా, ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేసినా నిందితుడిని అదుపులోకి తీసుకోలేదన్నారు.
సాక్షాలు సేకరిస్తున్నామంటూ పోలీసులు తాత్సారం చేస్తున్నారన్నారు. కనీసం నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని విమర్శించారు. నిందితుడిని పోలీసులు చుట్టంగా చూస్తున్నారని ఆరోపించారు. ముగ్గురు మృతి కారణమై న్యాయవాద వృత్తికే కళంకం తెచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టక పోవడం దారుణం అన్నారు. పోలీసులను ప్రశ్నించేవారు ఎవరూ లేరన్నట్టుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ముగ్గురు మృతికి కారణమైన వ్యక్తి కేసులో సిట్టింగ్ జడ్జ్తో విచారణ చేపడితే తప్ప నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందనే నమ్మకం లేదన్నారు. ఖదీర్ ఖాన్ మృతి కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని అన్నారు. ఈ సమావేశంలో పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్, గుంటి జగదీశ్వర్, చల్లా రాధా కిషన్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ధర రమేష్ బాబు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కచ్చూ హరీష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా మధు, మహిపాల్ పాల్గొన్నారు.