- వనజీవి రామయ్య జీవితం అందరికీ ఆదర్శం
- సిద్ధిపేటలో డ్రోన్ ద్వారా విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్రావు
- చెట్టు కన్నతల్లి లాంటింది: వనజీవి రామయ్య
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట నర్సాపూర్ సర్కిల్లో కషాయం వితరణ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు ప్రారంభించారు. అలాగే, జిల్లా అడవుల్లో పచ్చదనం పెంచేందుకు వినూత్న ప్రయమైన అడవిలో డ్రోన్ ద్వారా విత్తన బంతులు చల్లే కార్యాక్రమన్ని కూడా మంత్రి హరీష్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ… ప్రకృతికి సేవ చేస్తే మనుషులకు సేవ చేసినట్టేననీ, మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడితే మంచి గాలి వస్తుందన్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఆక్సిజన్ లేక కొనుక్కునే పరిస్థితి వచ్చిందనీ, ఒక్కరోజు మనిషి పీల్చే గాలి 3 ఆక్సిజన్ సిలిండర్లు, ఒక్కో సిలిండర్ ఖర్చు 700 రూపాయలు, ఈ లెక్కన మూడు సిలిండర్లకు 2100 ఖర్చు అవుతుందన్నారు. ఈ లెక్కన ఒక మనిషి జీవిత కాలంలో పీల్చే ఆక్సిజన్ కొనుగోలు చేస్తే.. 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్నారు. అయితే, చెట్లు ఉచితంగా ఆక్సిజన్ ఇస్తున్నాయనీ, వనజీవి రామయ్య జీవితం అందరికి ఆదర్శనీయమన్నారు.
ఆయన కోటికి పైగా మొక్కలు నాటారన్నారు. అడవుల్లో మనుషులు వెళ్ల లేని చోట ఉన్న ఖాళీ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకే డ్రోన్ వినియోగిస్తున్నామనీ, సీడ్ బాల్స్లో కోతులకు ఆహారం ఇచ్చే చెట్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం పెంపు కోసం అధిక ప్రాధాన్యత ఇస్తోందనీ, గత ప్రభుత్వాలు అడవుల్లో చెట్లు నరికితే ప్రస్తుత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అడవుల్లో మొక్కలు నాటి చెట్లు పెచుతోందన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మాట్లాడుతూ..అడవుల్లో పచ్చదనం పెంచడానికి సీడ్ బాల్స్ మంచి ప్రయత్నమనీ, సహజంగా మొలకెత్తిన మొక్క బలంగా పెరుగుతుందన్నారు. చెట్టు కన్నతల్లి లాంటిందనీ, లాటరీ టికెట్ కొంటె లాభం వస్తదో రాదో తెలియదు.
కానీ, మొక్క నాటితే పండ్లు, నీడ, గాలి ద్వారా లాభం వస్తుందన్నారు. నీటిలో చేప ఉన్నట్టుగా.. భూమిలో పండ్లు ఉన్నాయనీ, చేపను బయటకు తీయడానికి గాలం వేసినట్టు.. భూమిలోని పండ్లను బయటికి తీయడానికి మొక్క నాటాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ విధ్వంసం పరుగులు తీస్తోందనీ, ప్రతి రోజు 50వేల హెక్టర్ల విస్తీర్ణంలో అడవి అంతరించిపోతుందనీ, శాశ్వత ప్రాతిపదికన మనం బతకాలంటే.. మొక్కలు నాటి వృక్షాలుగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ రాజనర్సు, సుడా ఛైర్మన్ ఎం.రవీందర్రెడ్డి, సుడా డైరెక్టర్, కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్రెడ్డి, ఏఎంసి ఛైర్మన్ పాల సాయిరాం, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.