56 లక్షల ఎకరాల్లో 26,600 కోట్ల పంట కొనుగోలు
దేశంలో పండే పంట మొత్తాన్ని ఒక్క తెలంగాణ రాష్ట్రం పండిస్తుంది: మంత్రి హరీష్ రావు
కొత్తగూడెం/ ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఎవరెన్ని ట్రిక్కులు చేసినా తెలంగాణలో బిఆర్ఎస్దే హ్యాట్రిక్ ఖాయమని మంత్రి హరీష్ రావు అన్నారు. దేశంలో మొత్తం ఎంత పంట పండుతుందో ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే అంత పంట పండుతున్నదని స్పష్టం చేశారు. కరువు అనే పదాన్ని సీఎం కేసీఆర్ డిక్షనరీ నుండి తొలగించారని తెలిపారు.అకాల వర్షాలకు రైతులు అధైర్య పడొద్దని, తమది రైతు ప్రభుత్వమని, రైతు నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోతే ఎకరాకు రూ10 వేలు ప్రకటించారని అన్నారు. ఇప్పుడు కూడా అకాల వర్షాల వల్ల నష్టపోయారని, కేసీఆర్ ఉన్నడని , అధైర్య పడొద్దని రైతులకు భరోసా ఇచ్చారు. పంట నష్టం అంచనా వేయాలని సిఎస్కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన సోమవారం మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు హరీష్ రావు పువ్వాడ అజయ్ కుమార్ హాజరె•య్యారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…కల్లూరు మండలంలో తమ సమావేశానికి హాజరయిన మందిలో సగం మంది కూడా అమిత్ షా మీటింగ్లో లేరని మంత్రి ఎద్దేవా చేశారు. అధికారంలోకి వొస్తామని చెబుతున్న బిజెపి మాటలు ఎండమావిలాంటివని అన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వొస్తుందా అని ప్రశ్నించారు. నిజం చెప్పకుంటే అబద్ధాలు ప్రచారం అవుతాయని అంబేద్కర్ చెప్పారు. బిజెపి కూడా అబద్ధాలను పనికట్టుకుని ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. యాసంగి పంట 2014లో 14 లక్షల ఎకరాలు పండితే, నేడు 56 లక్షల ఎకరాల్లో పంట పండిందని గుర్తు చేశారు. 2014లో 3600 కోట్ల పంట కొనుగోళ్లు చేస్తే, గతేడాది 26,600 కోట్లు కొనుగోలు చేశామన్నారు. ఛత్తీస్ గడ్లో యాసంగిలో ఒక్క గింజ కొనరని, కానీ తెలంగాణలో ప్రతి గింజ రెండు పంటలు కొనుగోలు చేస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని అన్నారు. కేసీఆర్ రైతు విలువ పెంచారు కాబట్టి భూముల విలువ పెంచారని వెల్లడించారు. కర్ణాటకలో ఓటమి తప్పదు అనే భయంతో అమిత్ షా ఉన్నాడని చెప్పారు. రూ1350 కోట్లు హక్కుగా రావాల్సిన దాని గురించి, బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి చెప్పలేదని, జాతీయ ప్రాజెక్టు గురించి పల్లెత్తు మాట చెప్పలేదని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు కరెంట్, ఎరువులు ఇవ్వలేదని ఆరోపించారు.
ఏం ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వొస్తారుని ఎదురు ప్రశ్నించారు. హామీ ఇవ్వకుండా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు. కేసీఆర్ ప్రజల కోసం పోరాటం చేశారని, దిల్లీ పెద్దలకు కాంగ్రెస్ వాళ్ళు, గుజరాత్కు బిజెపి వాళ్ళు గులాంగిరి చేస్తారని విమర్శించారు. కానీ ప్రజల బాగు కోసం పని చేసే వారు భట్టి విక్రమార్క మధిరలో 100 పడకల హాస్పిటల్ తెచ్చుకోలేదు. కాంగ్రెస్ వాళ్లు వొస్తె రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి పథకాలు పోతాయన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన కంటి వెలుగు విజయవంతంగా కొనసాగుతున్నదన్నారు. 1.17 కోట్ల మందికి కంటి పరీక్షలు చేశాం. మొత్తం 2 కోట్ల మందికి చేస్తామన్నారు. మహారాష్ట్రలో నాలుగు రోజులకు ఒక సారి నల్లా వొస్తదని, కానీ తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి రోజూ నీళ్ళు వొస్తాయన్నారు.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కాదు, డబుల్ స్టాండర్డ్ ప్రభుత్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడు ఎన్ని ట్రిక్కులు చేసినా, హ్యాట్రిక్ కొట్టేది టిఆర్ఎస్ అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఉన్న నాయకులు ఎందుకు ఒక్క మెడికల్ కాలేజీ తేలేదని ప్రశ్నించారు. గతేడాది కొత్తగూడెంలో, ఈ ఏడాది ఖమ్మంలో మెడికల్ కాలేజీ వొచ్చిందని గుర్తు చేశారు. సీతారామ ప్రాజెక్టు నీళ్ళు మూడు నాలుగు నెలల్లో ఖమ్మంలో ప్రతి మండలానికి తెస్తాం. ప్రతి పంటకు నీళ్ళు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మెడికల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.