బషీర్బాగ్ కాల్పులకు 20 ఏళ్లు..
ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల నిర్వహించే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని అబ్రహం లింకన్ ప్రవచించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు తమ పార్టీ విధానాలను ప్రజాహితం కోసం అమలుచేస్తాయి. ఇందుకు ప్రభుత్వంలో వివిధ విభాగాలుంటాయి. అందులో పోలీసు శాఖ ఒకటి. ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా, శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు. వ్యవస్థల్లో పోలీసు ఒక విభాగమే కాని అది మాత్రమే ప్రభుత్వం కాదు. స్వాతంత్య్రాన ంతరం పోలీసు విధానం కొన్నేళ్ళు సజావుగా నడచినా, రాను రాను ఎన్నికయిన ప్రభుత్వాలు పాలనను చట్టసభలు, పార్టీ సిద్ధాంతాల ప్రాతిపదికన కాకుండా, పోలీసు వ్య్వస్థపై ఆధారపడడం రివాజైంది. ఈ విషయం లోతుగా పరిశీలిద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా 20 సంవత్సరాలకిందటి బషీర్ బాగ్ పోలీసు కాల్పులను పరిశీలిద్దాం. చంద్రబాబునాయుడు నేతృత్వంలోని నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఏకపక్షంగా విద్యుత్ చార్జీలు పెంచిందన్న కారణంగా అ విషయంలో తొమ్మిది వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జరిగిన విద్యుత్ ఉద్యమంలోని ప్రధాన ఘట్టం బషీర్ బాగ్ కాల్పులు. ఈ ఘట్టంలో ప్రభుత్వం ఆదేశాలను తు.చ. తప్పకుండా పోలీస్ వ్యవస్థ పాటించింది. ఉద్యమకారులు ముగ్గురు కాల్పులకు బలయ్యారు. పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం వాడుకుంటే ప్రజలకి జరిగే నష్టం ఏంటో మన తెలుగు ప్రజలకి బాగా తెలుసు. ప్రశ్నించే ప్రజలను తయారు చేసే ఉద్యమాలు జావకారి పోయాయి. ప్రజలను పరాజయం పాలు చేసి, వారిపై ఆధిపత్యం చేసే పోలీస్ వ్యవస్థ ఏ మేరకు అభివృద్ధి చెందింది అనేది కీలక ప్రశ్న. భారత దేశంలో అంతకంతకు బలపడి ప్రభుత్వ రక్షక..ప్రజా భక్షక శాఖగా మారిన భారతీయ పోలీస్ వ్యవస్థను ఓసారి పరిశీలిద్దాం.
రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులను ప్రభావితం చేయకుండా చూడడానికి స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటుచేయాలి. రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా బదిలీలు జరగకుండా సీనియర్ పోలీస్ అధికారుల పదవీకాలం కనీసం రెండు సంవత్సరాలు ఉండాలి. పోలీస్ శాఖను ఇన్వెస్టిగేషన్.. లా అండ్ ఆర్డర్ అని రెండు విభాగాలుగా విడదీయాలి. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ బోర్డు అధికారుల బదిలీలు, పదోన్నతులు పర్యవేక్షిస్తుంది. పోలీసులుపై ఉన్న ఫిర్యాదులు ప్రజలకు తెలియజేసేందుకు, పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఫర్ సిటిజన్స్ ఏర్పాటు చేయాలి. నేషనల్ సెక్యూరిటీ కూడా కమిషన్ ఏర్పాటు చేయాలి.మోడీ నేతృ త్వంలోని కేంద్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఆధునీకరించడానికి గతంలో 25 వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించింది. ఈ మొత్తంతో పోలీసులు మరిన్ని ఆయుధాలు సమకూర్చుకున్నారు. ఈ ప్రహసనాన్ని ప్రభుత్వ అనుకూల మీడియా పోలీస్ సంస్కరణలుగా పేర్కొంటూ వార్తా కథ•నాలు వండి వార్చింది.ఆగస్టు 28న బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సంస్థ స్వర్ణోత్సవాలు జరుపుకుంది. ఈ ఉత్సవాలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా గౌరవ అతిథిగా హాజరయ్యారు. కొరోనా సంక్షోభం కారణంగా ఈ వేడుకలను వర్చువల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ చేసిన తీర్మానం ప్రకారం 1970 ఆగస్టు 28న బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఏర్పాటైంది. పోలీసింగ్లో ప్రతిభను పెంచటం, పోలీస్ సమస్యలను ఒక పద్ధతి ప్రకారం వేగంగా అధ్యయనం చేయటం, పోలీసుల మెలకువలలో శాస్త్ర సాంకేతిక అంశాల వినియోగం దీని ప్రధాన లక్ష్యాలు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సంస్థ 49వ వ్యవస్థాపక దినోత్సవం ముగించుకొని 50వ ఏట అడుగుపెడు తున్నసందర్భంగా ఇలా అభివర్ణించారు. ‘‘బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కే బగైర్ అచ్ఛీ పోలీసింగ్ కీ కల్పనా నహీ హో సక్తీ’’(బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ లేకుండా మెరుగైన పోలీసింగ్ను ఊహించుకోలేం).