- వ్యాధులు దూరం కావడంతో పాటు ఫిట్గా ఉంటాం
- యోగా ఉత్సవ్లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
- యోగాతో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : నిత్యజీవితంలో యోగా ఒక భాగంగా మారాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. నిత్యం యోగా చేయడం వల్ల యవ్వనంగా ఉంటారని..అనేక శారీరక రుగ్మతల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఇస్లాం దేశాలు కూడా యోగాను ఆదరిస్తున్నాయని చెప్పారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కౌంట్డౌన్ పేరుతో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిత్యం యంగ్గా ఉండాలంటే యోగా చేయాలని ప్రజలకు గవర్నర్ తమిళిసై సూచించారు. యోగాతో ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. ఫిట్గా ఉండేందుకు ఉపయోగపడుతుందని, హైపర్ టెన్షన్ వంటివి దూరం అవుతాయని తెలిపారు. జూన్ 21 న యోగాడేను జరుపుకోవడానికి ప్రధాన కారణం ఆ రోజు యేడాది మొత్తం వి•ద ఎక్కువ పగలు ఉండే రోజు అని చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా 190 పైగా దేశాల్లో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో ముస్లిం దేశాలు కూడా ఉన్నాయని తెలిపారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.
జూన్ 21ని యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. అజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా యోగా డే నిర్వహణ జరగనుందన్నారు. జూన్ 21న ట్యాంక్బండ్పై అంబేడ్కర్ విగ్రహం దగ్గర యోగా డే వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అందరూ పాల్గొని యోగా డేను విజయవంతం చేయాలని కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాకు మరింత ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాల్ అన్నారు. ప్రతి ఒక్కరు రోజులో కనీసం 15 నిమిషాలైనా యోగా చేయాలని సూచిస్తారు డాక్టర్లు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం. అయితే ఈ ఏడాది యోగా డేను కాస్త వైవిధ్యంగా నిర్వహించాలని కేంద్ర ఆయుష్-సాంస్కృతిక, పర్యాటక శాఖలు నిర్ణయించాయి. జూన్ 21న అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని దానికంటే 25 రోజుల ముందే యోగా ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఈ వేడుకకు వేదిక అయింది. 25 రోజుల కౌంట్డౌన్ను దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని నిర్ణయించగా.. దానికి హైదరాబాద్ను ఎంపిక చేశారు. తొలుత ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టగా.. తరవాత పర్యాటక శాఖకు కూడా ప్రధానమంత్రి ఇందులో భాగస్వామ్యం కల్పించారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాకు ప్రత్యేక గుర్తింపు ఉందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యోగా ఉత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందనిఅన్నారు. యోగా జీవితంలో భాగంగా మారిందని.. ఆరోగ్యంగా ఉండాలని అది దినచర్యగా మారాలని చెప్పారు. యోగాకు మరింత గుర్తింపు తీసుకువస్తోన్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం యోగా చేయడం వల్ల యవ్వనంగా ఉంటారని.. అనేక శారీరక రుగ్మతల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసైతోపాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, క్రికెటర్ మిథాలి రాజ్, సినీ నిర్మాత దిల్ రాజు, మా అధ్యక్షుడు మంచు విష్ణు పాల్గొన్నారు.