“వోటు వేయడానికి విముఖంగా ఉండటానికి కారణాలు ఏమిటి? అని పరిశీలిస్తే ఈ వారంలో సెలవులు రావడం మూలంగా ఉద్యోగ వర్గాల ప్రజలు వివాహాలకు, ఫంక్షన్లకు, బయటి ప్రాంతాలకు వెళ్లి తిరిగి రాకపోవడం, కొంత మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రంహోం వల్ల సొంత గ్రామాల్లోనే ఉండి పని చేస్తూ ఉండటం, పోలింగ్ సమయంలో అల్లర్లు జరుగుతాయనే వదంతులు రావడం, వోటర్ల జాబితాలు సరిగ్గా లేకపోవడం, వోట్లు ఒక డివిజన్ నుండి మరో డివిజన్కు గల్లంతు కావడం, కోవిడ్ సోకుతుందని భయం, అకాల వర్షాలు భారీగా కురవడం వల్ల సొంత ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి రాకపోవడం, పెయిడ్ హాలిడే ఉన్నప్పటికీ ఉద్యోగులు, విద్యావంతులు వోటు హక్కును వినియోగించుకోకపోవడం విచారకరం.”
తరతరాల విదేశీ పాలన నుండి స్వేచ్ఛను పొందిన స్వాతంత్య్ర రాజ్యంలో అనేక వైరుధ్యాలతో కూడిన ప్రజానీకం వుంది.భాషాపరంగా, మతపరంగా,జాతిపరంగా,ప్రాంతపరంగా
‘’భిన్నత్వం లో ఏకత్వంగా ‘’ వున్నా భారతదేశాన్ని పాలించు కోవడానికి, స్వాతంత్ర పోరాటం లో భారతీయులను ఉత్తేజపరిచిన స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం, సమానత్వం అనే ప్రజాస్వామ్య సిద్ధాంతాలు మూలంగా ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి భారత ప్రజలు 1946 డిసెంబర్ 9 న రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు జరిగింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీ ఏర్పడింది. దాదాపు 60 రాజ్యాంగాలు చదివి అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.దాని ప్రకారం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడం జరుగుతుంది.
ప్రజాస్వామ్యం అంటే… ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజలుపాలించడమే…. ప్రజాస్వామ్యం అని అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ అన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకోబడిన వారే పాలితులు. ప్రజలు తమకు నచ్చిన వారిని ఎన్నుకొని, పాలింప చేసే అవకాశం కలదు. అందుకే ప్రజాస్వామ్యానికి ప్రాణం ఎన్నికలు. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అటువంటి పరిస్థితులను కల్పించవలసిన బాధ్యత రాజ్యాంగం ద్వారా ఏర్పాటయిన ప్రభుత్వాలదే . ఎన్నికలు ప్రజల విశ్వాసానికి గుర్తు ….. నవ సమాజ నిర్మాణానికి దిక్సూచి ఎన్నికల ప్రక్రియ. రాజ్యాంగంలోని 326 ప్రకరణ ద్వారా భారతదేశ ప్రజలకు ఓటు హక్కు కల్పించబడినది. ఓటు హక్కు ప్రాథమిక హక్కుగా ఉండాలని రాజ్యాంగ పరిషత్తు లోని కొంత చర్చ జరిగింది. కానీ దీనిని ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చలేదు. మొదట ఓటు హక్కు పొందడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండగా 61 వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని 18 సంవత్సరాలకు కుదించారు. ఓటు హక్కు పొందడానికి భారత పౌరుడై ఉండాలి, 18 సంవత్సరాలు నిండిన వారు , దివాలా తీయకుండా, మతిస్థిమితం లేని వాడై ఉండకూడదు. మరియు కుల ,మత ,వర్గ, లింగ వివక్ష లేకుండా భారత పౌరులందరికీ ఓటు హక్కు కల్పించారు. ఓటు హక్కుతో దేశం యొక్క భవిష్యత్తును మార్చే అవకాశం కలదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది. ఓటు ఒక ఆయుధం .రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ‘’ నేను నా దేశ ప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు ,ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులు అవుతారో, అమ్ముకొని బానిసలు అవుతారో అది వారి చేతుల్లోనే ఉంది ‘’ అన్నారు. దీనిని బట్టి తెలుసుకోవచ్చు ఓటు యొక్క ప్రాముఖ్యత…. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును విస్మరించడం, వినియోగించుకోకపోవడం భారత పౌరునిగా బాధ్యతను విస్మరించినట్లే అవుతుంది.
బాధ్యతను నెరవేర్చని వారు హక్కుల గురించి అభివృద్ధి గురించి ప్రశ్నించే అధికారం కోల్పోతారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అత్యల్పంగా ఓటు హక్కును వినియోగించుకోవడం విషాదకరం…. తాము నివసించే ప్రాంతం అభివృద్ధి పట్ల ఏమాత్రం పట్టింపు లేదు. ఇక సౌకర్యాలు ఎలా మెరుగవుతాయి? విశ్వనగరం గా పేరుపొందిన నగరాభివృద్ధికి ప్రజలు అభివృద్ధి పరిచే పార్టీలకు ఓటు వేయాల్సిన అవసరం ఉండే… ఇంత పేలవంగా నిర్లిప్తతతో ఓటింగ్ జరగడం ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ప్రమాదం…. కేవలం 45.71 శాతం మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే 54.29 శాతం మంది ఓటర్లు ఓటు వేయలేదని అర్థం . అదికూడా మంగళవారం సాయంత్రం వరకు 36.73 పోలింగ్ నమోదయినట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం ఆశ్చర్యకరం….. తుదకు 9 శాతం పోలింగ్ పెరిగి 45.71 శాతం గా నమోదయినట్లు ప్రకటించింది. ప్రతిష్టాత్మకంగా, వాడివేడిగా మాటల తూటాలతో జరిగిన ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం ముగిసింది. ప్రచార ఆర్భాటాన్ని చూస్తే జరిగిన రోడ్ షోలు, మీటింగ్ లను పరిశీలిస్తే కోవిడ్-19 ప్రత్యేక పరిస్థితుల్లో కూడా జనాదరణ బాగుందని, కోవిడ్ విజృంభిస్తుంది ఏమో అని భయం వేసింది. అటువంటి కనివిని ఎరుగని ప్రచారం జరిగింది. దేశ అగ్రనాయకులు సైతం విశ్వ నగరానికి ఒకసారి వచ్చి పోయారంటే ఎంత విశేషత కలిగిన ఎన్నికలో? అర్థం చేసుకోవచ్చు.
అటువంటి ఎన్నికలలో సగానికి పైగా నగర ప్రజలు ఓటు వేయలేదు అంటే కారణం ఏమై ఉండవచ్చునని మేధావులు ఆలోచనలో పడ్డారు. ఓటు వేయడానికి విముఖంగా ఉండటానికి కారణాలు ఏమిటి? అని పరిశీలిస్తే ఈ వారంలో సెలవులు రావడం మూలంగా ఉద్యోగ వర్గాల ప్రజలు వివాహాలకు, ఫంక్షన్లకు, బయటి ప్రాంతాలకు వెళ్లి తిరిగి రాకపోవడం, కొంత మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రంహోం వల్ల సొంత గ్రామాల్లోనే ఉండి పని చేస్తూ ఉండటం ,పోలింగ్ సమయంలో అల్లర్లు జరుగుతాయనే వదంతులు రావడం, ఓటర్ల జాబితాలు సరిగ్గా లేకపోవడం ,ఓట్లు ఒక డివిజన్ నుండి మరో డివిజన్ కు గల్లంతు కావడం, కోవిడ్ సోకుతుందని భయం, అకాల వర్షాలు భారీగా కురవడం వల్ల సొంత ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి రాకపోవడం, పెయిడ్ హాలిడే ఉన్నప్పటికీ ఉద్యోగులు, విద్యావంతులు ఓటు హక్కును వినియోగించుకోకపోవడం విచారకరం.
ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే ప్రమాద సంకేతం…. ఓటర్ల జాబితాలను రివైస్ చేయకపోవడం వల్ల ,తప్పుల తడకలతో కూడిన పాత జాబితాలనే ఉపయోగించడం వల్ల, ఓటు వేసేందుకు గుర్తింపు కార్డుతో పోలింగ్ కేంద్రానికి వెళ్ళిన ఓటు లేదని చెప్పడంతో చాలామంది వెనుదిరిగి పోయారు. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ జీవితంలో ఒక భాగమైపోయింది. శరీరంలో ఒక అవయవంగా మారిపోయింది. అలాంటి ఈ నవీన కాలంలో మొబైల్ ఫోన్ ఓటింగ్ కంపార్ట్మెంట్లో కి అనుమతించకపోవడంతో చాలా మంది ఓటర్లు వెనుదిరిగి పోయారు. ఓటు వేయడానికి వచ్చిన వారి మొబైల్ ఫోన్లు పోలింగ్ సిబ్బందికి ఇచ్చేసి, ఓటు వేసిన తర్వాత తీసుకొని వెళ్లే లాగా ఏర్పాటు చేస్తే బాగుండేది. అందుకు పోలింగ్ సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయాలు, పార్టీలు, ఎన్నికల పట్ల అయిష్టత కలిగిన చాలా మంది ప్రజలు ఓటు వేయడానికి రాలేదు.
కో విద్ నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా పెంచడం వల్ల ఓట్లు కొత్త పోలింగ్ కేంద్రాలకు కేటాయించినప్పుడు కుటుంబ సభ్యుల ఓట్లు 2,3 పోలింగ్ కేంద్రాల్లోకి మారడం వల్ల , ఆ పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో లేకపోవడం, దూర భారంగా ఉండటం తదితర కారణాల వలన పోలింగ్ పేలవంగా నమోదు అయింది. పోటీలో నిలబడ్డ అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించడంలో, వారి ఓటు వినియోగించుకునే విధంగా చేయడంలో విఫలమయ్యారు. చలి, కరోనా ల తో ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బయటికి రాలేకపోవడం, పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కూడా క్లిష్టంగా ఉండటంతో పెద్దగా ఎవరు ఉపయోగించుకోలేదు. పాఠశాలల మూసివేయడం వల్ల కూడా పోలింగ్ శాతం పడిపోయింది .పార్లమెంట్ ఎన్నికలలో గ్రేటర్ హైదరాబాద్ లో 50 శాతం మించి పోలింగ్ నమోదైంది. దానితో పోల్చిన ,స్థానిక ఎన్నికలలో పోలింగ్ తక్కువగానే ఉంది. వరద బాధితులు కూడా నిరసనగా ఓటు హక్కు వినియోగించుకో లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పలురకాల కారణాలతో పోలింగ్ పేలవంగా జరిగింది. పోలింగ్ పెరగడానికి ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ,పథకాలు ఓటు వేసిన వారికే వర్తింపజేయాలి అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ శిక్షలు వేస్తారని, ప్రభుత్వ పథకాలు ఆపేస్తారని భయంతో కాకుండా రాజ్యాంగపు హక్కు, పాలకులను నిర్ణయించే అవకాశం భవిష్యత్తు నిర్దేశించుకునే ఓటు హక్కును స్వచ్ఛందంగా వేసేంత చైతన్యం రావాలి. బాధ్యతగా నిర్వర్తించాలి.
బాధ్యతలకు నిలబడ్డప్పుడే హక్కులకై కలబడే సత్తా వస్తుంది. బాధ్యతల నుండి తప్పించుకున్నప్పుడు హక్కుల గురించి ఎలా మాట్లాడుతాము ? ఎలా ప్రశ్నిస్తాం? ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇంటి దగ్గర నుండే ఎంతో చైతన్య పూరితమైన వ్యాఖ్యానాలు ,కథనాలతో కూడిన పోస్టింగ్ లు చేస్తున్నారు, కానీ ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు. ఇది విడ్డూరంగా ఉంది. చాలా దేశాలలో తప్పనిసరి ఓటింగ్ విధానం అమలులో ఉంది. ఓటు వేయకపోతే శిక్షలు పడతాయి. భారతదేశంలో అటువంటి విధానం లేదు. ఇకముందు కంపల్సరీ ఓటింగ్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో పోలింగ్ సరళి ఎక్కువగా నమోదు అవుతుంది. గ్రామాలలో ఓటు వేయకపోతే జనాభా లెక్కల్లో లేనట్లుగా, భావిస్తారు. ఓటు వేయకపోతే ఏదో కోల్పోయినట్లు బాధపడతారు. ఆ పరిస్థితి నగరాలలో లేదు. నగరాలలో కూడా గ్రామీణ ప్రాంతాలలో లాగా ఓటింగ్ జరిగేలా ఎలక్షన్ కమిషన్, ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజాస్వామిక పాలనకు దోహదపడుతుంది.

ఉపాధ్యక్షుడు, టి.పి.టి.ఎఫ్. మహబఃబాద్ జిల్లా. 9989584665