తెలంగాణ రాజధాని హైదరాబాద్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తుంపు పొందిన నగరంగా విఖ్యాతినొందు తుండడం నిజంగానే తెలంగాణ ప్రజలకు ఎంతో గర్వకారణం. దేశ, ప్రపంచ వ్యాప్తంగా పలు అంశాల్లో ఈ నగరం ఎప్పుడూ ముందువరుసలో నిలుస్తున్నది. ఇతర దేశాలు, నగరాలతో పోలిస్తే టాప్ ఇరవైలో ఉండటం హర్షించదగిన విషయం. తాజాగా ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల నగరాల జాబితాలో ఈ నగరానికి చోటు దక్కటం సంతోషించదగిన విషయం. రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ హైదరాబాద్ నగరానికి నాలుగు శతాబ్దాల చరిత్ర ఉండటమే ఇందుకు కారణం. హైదరాబాద్ అనగానే అదో మిని ఇండియాగా భావిస్తారు. వివిధ భాషలు, మతాలు, కులాలు, రాష్ట్రాలతో పాటు, విదేశాలకు చెందిన పలువురు స్వేచ్ఛగా, హాయిగా నివసిస్తున్న నగరం ఏదైనా ఉందంటే ముందువరుసలో నిలిచేది హైదరాబాదే. వ్యాపార పరంగా, హైదరాబాద్ బిర్యానీతో ఎంత ప్రఖ్యానార్జించాందో వాణిజ్య, సాఫ్ట్వేర్ టెక్నాలోజీలో ఇతర రాష్ట్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ నగరం పోటీపడుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పలు విదేశీ కంపెనీలు ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు అమితోత్సాహాన్ని చూపిస్తున్నాయి.
ప్రభుత్వం కూడా అలాంటి వారికి రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఫలితంగా ఇప్పటికే పలు విదేశీ సంస్థలు ప్రభుత్వంతో ఎంఓయు చేసుకున్నాయి. కొన్ని సంస్థలు అప్పుడే తమ కార్యక్రమాలను ప్రారంభించాయి కూడా. కాగా, పలు స్వచ్ఛంద సంస్థలు ఇటీవల వివిధ రంగాల్లో ప్రత్యేకతను చాటుకునే నగరాలు, రాష్ట్రాలను బేరీజు వేస్తున్నప్పుడు అనేక రంగాల్లో టాప్ టెన్లోనో, ట్వంటీలోనో ఉంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నది. ఇటీవల ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టింగ్ సేవల సంస్థ జెఎల్ఎల్ ( రిలయల్ ఎస్టేట్ రంగంలో పేరొందిన సంస్థ) 2020 సంవత్సరానికిగాను ప్రపంచంలోనే అత్యంత క్రీయాశీల నగరాల జాబితాలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. సాఫ్ట్వేర్ రంగంలో దేశంలోనే ముందువరుసలో ఉంటున్న బెంగుళూరు ఈ సంస్థ రూపొందించిన జాబితాలో రెండవ స్థానంలో ఉండడం విశేషం. డైనమిక్ నగరాల సూచీని తయారు చేసిన ఈ సంస్థ ప్రపంచంలోని 130 నగరాలను ఎంపిక చేసుకుంది. వీటిల్లో టాప్ 20 స్థానాల్లో ఏడు భారతీయ నగరాలు ఉండడం విశేషం. సామాజిక, ఆర్థిక వ్యవస్థ, స్థిరాస్తి, వ్యాపార ఉపాధి అవకాశాలను ప్రామాణికంగా ఎంచుకుంది. సిటీ మూమెం•మ్ ఇండెక్స్-2020 పేర రూపొంది ంచిన నివేదికను తాజాగా తెలంగాణ మంత్రి కెటిఆర్ విడుదల చేశారు. విచిత్రమైన విషయమేమంటే డైనమిక్ నగరాల సూచీలో మూడేళ్ళలో రెండుసార్లు హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు అసలు ఆ జాబితోలోనే హైదరాబాద్ లేదు. కాని 2015లో 20వ స్థానం, 2016లో అయిదవ స్థానం, 2017లో మూడవ స్థానం, 2018లో మొదటి స్థానంలో నిలువగా, 2019లో రెండవ స్థానం నుండి 2020 వొచ్చేసరికి మరోసారి అగ్రస్థానంలో నివడం నిజంగా తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.
తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ సురక్షిత నగరంగా పేరు వొచ్చింది. దానివల్లే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు విదేశ సంస్థలు కూడా మొగ్గు చూపుతున్నాయి. అమెజాన్, యాపిల్, గూగుల్, ఫేస్బుక్ లాంటి మేటి సంస్థలు ఇక్కడ తమ శాఖలను ఏర్పాటుచేయడం ఆనందించదగిన విషయం. అంతేకాదు ఇక్కడ ప్రపంచ స్థాయి సదస్సులను ఏర్పాటు చేయడానికి కూడా చాలా సంస్థలు ముందుకు రావడం విశేషం. తాజాగా ప్రపంచ స్థాయి వైమానిక సదస్సు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారంటే హైదరాబాద్ ప్రపంచ పటంలో ఏమేరకు చోటు చేసుకుందన్నది అర్థమవుతున్నది. దానికి తగినట్లుగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఐటి రంగాన్ని మరింత విస్తరింప చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. సాఫ్ట్వేర్, దాని ఆధారిత పరిశ్రమలను మరింత విస్తరింపజేసేందుకు నగరం చుట్టూ క్లస్తర్లను ఏర్పాటు చేస్తున్నది. ఐటి అనగానే ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావద్దన్న లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నది. హైదరాబాద్ టూరిస్టు ప్రాంతంగా ఇప్పటికే పాపులర్గా ఉంది. బహమనీ సుల్తానులు, నిజాంల నాటి అతి సుందర కట్టడాలెన్నో కనుల విందు చేస్తుండడంతో నిత్యం వేలాది సంఖ్యలో ఈ ప్రాంతాన్ని చూసేందుకు టూరిస్టులు వొస్తుంటారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ నిర్మాణాలు కూడా ఇప్పుడు అంత పేరును సంపాదించుకున్నాయి. దేశ విదేశాల వారు ఈ నిర్మాణాలను చూసేందుకు ప్రత్యేకంగా రావడం, వాటిని ప్రశంసించడం, నిర్మాణ శైలిని తెలుసుకునే ప్రయత్నం చేయడం లాంటి క్రియలు కూడా హైదరాబాద్ ప్రాశస్త్యాన్ని ప్రపంచ పటంలో నిలుపుతున్నాయి.
Tags: hyderabad, greater hyderbad, articles,telangana