దేశంలో ఏకైక నగరంగా గుర్తింపు పొందడం పట్ల మంత్రి కెటిఆర్ హర్షం
గ్రేటర్ హైదరాబాద్కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ), ఆర్బర్ డే ఫౌండేషన్లు హైదరాబాద్ నగరాన్ని ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ -2020’గా ప్రకటించాయి. హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచేందుకు తగు జాగ్రత్తలు చేపట్టడం ద్వారా హైదరాబాద్ నగరాన్ని ఆరోగ్యకరమైన, సంతోషకర నగరంగా రూపొందడానికి దోహదపడ్డాయి.
ప్రపంచంలోని 63 దేశాల నుండి 120 నగరాలు ఎఫ్ఏఓ, ఆర్బర్ డే ఫౌండేషన్ పరిగణనలోకి తీసుకోగా వీటిలో 2020 సంవత్సరానికిగాను 51 నగరాలను ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా ప్రకటించింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన నగరాలు ఈ జాబితాలో ఉండగా భారతదేశం నుండి ఏకైక నగరం హైదరాబాద్ ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తింపు పొందింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్లో గత కొన్నేళ్లుగా కోట్లాది మొక్కలను జిహెచ్ఎంసితో పాటు ఇతర శాఖలు నాటడంతో పాటు వాటి మనుగడకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. హరిత భవిష్యత్కు గాను మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకై ఐదు ప్రధాన లక్ష్యాలను మున్సిపల్ శాఖ చేపట్టింది.
మొక్కల సంరక్షణ బాధ్యతను అప్పగించడం, మొక్కల నిర్వహణకు ప్రత్యేక నిబంధనల ఏర్పాటు, మొక్కల ప్రాధాన్యతను తెలియజేయడం, ప్రత్యేక నిధుల కేటాయింపు, చెట్ల పెంపకంపై చైతన్యం పెంచే ఉత్సవాల నిర్వహణ అనే లక్ష్యాలతో హైదరాబాద్ నగరంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్, కార్యాలయాలు, విశ్వవిద్యలయాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున చేపట్టిన హరితహారం ప్లాంటేషన్ వివరాలను ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ -2020 గుర్తింపుకు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం హైదరాబాద్ నగరానికి ఈ గుర్తింపునిస్తూ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ), ఆర్బర్ డే ఫౌండేషన్లు ప్రకటించాయి.