పెట్రోల్ ధరలు పెంచి నడ్డివిరుస్తున్న ప్రభుత్వాలు
కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులపై భారం పడుతుందని, పెంచిన ధరలను తగ్గించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కాంగ్రెస్ నాయకులు గంటపాటు రాస్తారోకోకు దిగడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జగిత్యాల అర్డివో మాధురికి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ దేశమంతా గత నాలుగు నెలలుగా కరోనాతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రజలపై రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను మరింత కుంగదీస్తుందని విమర్శించారు. 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో 50రూపాయలున్న డీజిల్ ధర నేడు 80 రూపాయలకు చేరడం శోచనీయమన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్ ,డీజిల్ ధరలు పెరుగడం విచిత్రంగా ఉందన్నారు. పెరిగిన ధరలతో నిత్యావసర వస్తువులపై భారం పడి సామాన్యుల నడ్డివిరిచే పరిస్థితులున్నాయని పేర్కొన్నారు. ఒకవైపు కరోనా నివారణతోపాటు పేద ప్రజలను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తూ మరోవైపు ఎక్సైజ్ పన్ను రూపేనా 18లక్షల కోట్లు పేద ప్రజలు నుంచి పన్నుల పేరిట వసూలు చేసిన ఘనత మోడీకి దక్కుతుందన్నారు. అరేండ్లలో బిజేపి పార్టీ అధికారంలో ఉండి ప్రజలపై బారాలను మోపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘‘ఆయుష్మాన్ భారత్’’ ను తెలంగాణ లో ఎందుకు అమలు చేయడం లేదని జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసిఆర్ను ప్రశ్నించారు.
కరోనా వ్యాధిని అరికట్టడంలో, పరీక్షలు చేయడంలో రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడమేనని జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ సరిహద్దుల్లో చైనా సైనికుల ఘర్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్ల కుటుంబాలను అన్నివిధాల ఆదుకోవాలన్నారు. మోడీ వైఫల్యాల వల్లనే 20 మంది దేశ సైనికులు వీరమరణం పొందారని ,దీనికి ప్రధానమంత్రి మోడీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టిపిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కల్లెపల్లి దుర్గయ్య, బీర్పూర్ మండల పరిషత్ అధ్యక్షులు మసర్తి రమేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మన్సూర్ అలీ, గొల్లపల్లి సర్పంచ్ ముస్కు నిషాంత్ రెడ్డి, నాయకులు దేవేందర్ రెడ్డి, గజ్జెల స్వామి, గాజుల రాజేందర్, గాజంగి నందయ్య, దారం ఆదిరెడ్డి, శ్రీకాంత్, నక్క జీవన్, బింగి రవి, గంగం మహేష్, శరత్ రెడ్డి, పులి రాము, తోట నరేష్, గుండ మధు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.