తెలంగాణలో కొరోనా టెస్టులు, చికిత్స వ్యవస్థలు పూర్తిగా గాడి తప్పినట్టు హైకోర్టు వ్యాఖ్యలతో స్పష్టమవుతోందనీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి అలియాస్ రాములమ్మ అన్నారు. ఈ మేరకు ఆమె తన ఫేస్బుక్ ద్వారా ఓ పోస్టు చేస్తూ…. శాంపిల్స్ సేకరణ, ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం ఒకవైపు…. ఇదయ్యాక చికిత్స అందిస్తున్న తీరు మరోవైపు జనాన్ని అయోమయంలోకి నెడుతున్నాయన్నారు. చికిత్స చేయించుకుంటూ ప్రాణాలొదిలిన జర్నలిస్టు మనోజ్, చనిపోతున్నాను డాడి బైబై అంటూ తుదిశ్వాస విడిచిన రవికుమార్…
ఇలా ఎన్నో ఉదాహరణలు కొరోనా చికిత్స విషయంలో కేసీఆర్ సర్కారు పనితీరులోని డొల్లతనాన్ని ఎండగడుతున్నాయనీ అన్నారు. హెల్త్ బులిటెన్స్లో అసమగ్ర సమాచారం… దారి తప్పిన ఐసీఎంఆర్ నియమనిబంధనలు… రాష్ట్రస్థాయి అధికారుల సమాచారంలోనే సమన్వయ లోపం… ఇలా అన్ని విషయాల్లోనూ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందన్నారు. ఇదంతా ఒక కోణమైతే, మాస్కు లేకుండా తిరిగేవారిపై 70వేలకు పైగా కేసులు నమోదైన హైదరాబాదులో మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసులు మాస్కులు లేకుండా, కనీస భౌతిక దూరం పాటించని దృశ్యాలు మీడియాలో దర్శనమిచ్చాయనీ, బాధ్యత గల వారే ఇలా ఉంటే ఇక ప్రజలకు ఎలా మార్గదర్శకులవుతారో… పరిస్థితిని ఎలా కంట్రోల్ చేస్తారో ఆ దేవుడికే తెలియాలని విజయశాంతి ఆ పోస్టులో పేర్కొన్నారు.