- పేదలుగా ఉన్న అన్ని వర్గాలకూ ఓవర్సీస్ స్కాలర్షిప్లు
- బ్రాహ్మణుల పట్ల, గురువుల పట్ల కెసిఆర్కు అపారమైన గౌరవం
- బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో ఓవర్సీస్ స్కాలర్షప్లు అందజేసిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : గత పాలకులు ఉన్నత వర్గాల్లోని పేదల గురించి మాట్లాడే ధైర్యం చేయలేదని, కులం మతంతో సంబంధం లేకుండా తెలంగాణలో ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. ముందు కల్యాణ లక్ష్మి దళితులతో మొదలుపెట్టి ఇప్పుడు రాష్ట్రంలోని పేదవారందరికీ అందిస్తున్నామని, ఓవర్సీస్ స్కాలర్ షిప్ కూడా దళిత వర్గాలకు ఇచ్చిన సమయంలోనే పేదలుగా ఉన్న అన్ని వర్గాలకు అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు బ్రాహ్మణుల పట్ల, గురువుల పట్ల మొదటి నుంచి అపారమైన గౌరవం ఉందని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారి బ్రాహ్మణ సమాజ సామూహిక భవనాన్ని సిద్దిపేటలో నిర్మించారని మం ్రఅన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం అలోచించే మన ముఖ్యమంత్రి కెసిఆర్ నిజమైన హిందూ ధర్మ పరిరక్షకులలని, మిగితా వారు రాజకీయాల కోసం హిందూ మతాన్ని వాడుకుంటారన్నారు.
సోమవారం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో వివేకానంద విదేశీ విద్యా పథకం అర్హులకు స్కాలర్ షిప్ మంజూరు పత్రాలను అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో ప్రభుత్వం గుడి కట్టిన ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ మాత్రమేనని, ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో ఉన్న అన్ని దేవాలయాలను అభివృద్ధి చేశారన్నారు. అర్చకులకు పుణ్య కార్యం జరిగితేనే జీతాలు వొచ్చే పరిస్థితి ఉండేదని, కానీ ఇపుడు ముఖ్యమంత్రి ప్రతీ నెల అర్చకులకు జీతాలు సమయానికి వొచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. వివేకానంద ఓవర్సీస్ స్కాలర్ షిప్ వొచ్చిన ప్రతి ఒక్కరికి మంత్రి అభినందనలు తెలిపారు. కష్టపడి బాగా చదువుకోవాలని, అందరికీ బ్రాహ్మణ బంధువుగా అండగా ఉంటూ బ్రాహ్మణ పరిషత్ సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. ఇంకా స్కాలర్ షిప్, ఇతర పథకాల గురించి మాట్లాడుతూ…
ఈ ఏడాది 121 మందికి రూ. 24.20 కోట్లు మంజూరు అయ్యాయని, ఒక్కో విద్యార్దికి రూ. 20 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఇప్పటివరకు 617 మంది లబ్దిదారులకు రూ. 64.24 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని, ఇంటర్ ఆపై చదువుకునే పేద బ్రాహ్మణ విద్యార్ధులకు రీయింబర్స్మెంట్, వేద విద్యార్ధులకు నెలకు రూ. 250, వేద విద్య పూర్తయ్యాక వృత్తిలో నిలదొక్కుకునేందుకు మూడు నుంచి నాలుగు లక్షల ఆర్థిక సాయం, వేద పాఠశాలల్లో మౌలికవసతుల కోసం గరిష్టంగా రెండు లక్షలు, నిరుద్యోగులకు గ్రూప్ 1 ఉచిత కోచింగ్తో పాటు నెలకు రూ. 5 వేలు, ఇతర ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేవారికి నెలకు రూ. 2 వేల సాయం, చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి 60 నుంచి 80 శాతం సబ్సిడీతో ఇప్పటివరకు 3647 మందికి రూ. 104 కోట్ల లబ్ది జరిగిందని వివరాలు వెల్లడించారు.
రాష్ట్రం ఏర్పడిన వెంటనే 18 మందితో బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు, సూర్యాపేట, సిద్ధిపేట, ఖమ్మంలో బ్రాహ్మణ భవనాలు నిర్మించుకున్నామని, హైదరాబాదులోని గోపన్ పల్లిలో 6 ఎకరాల విస్తీర్ణంలో రూ. 20 కోట్ల వ్యయంతో కొత్త బ్రాహ్మణ భవన్ ప్రారంభానికి సిద్ధంగా ఉందని, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు ప్రతీ ఏటా రూ. 100 కోట్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీష్ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, మాజీ మంత్రి వేణు గోపాలా చారి,, ఎండోమెంట్ కమిషనర్ అనిల్, సీఎం సిపిఆర్ఓ జ్వాలా నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, దేవి ప్రసాద్, బ్రాహ్మణ పరిషత్ నాయకులు హాజరయ్యారు.