(భారత ప్రభుత్వ ‘జాతీయ యువజన పాలసీ-2021’ ముసాయిదా ఆధారంగా)
2003 తరువాత 2014లో తీసుకువచ్చిన జాతీయ యువజన పాలసీ-2014లో 11 ప్రాధాన్య అంశాలను నిర్ణయించి అమలు దిశగా అడుగులు వేయడం జరిగింది. 2014 యువజన పాలసీలో విద్య, నైపుణ్యాభివృద్ధి/ఉద్యోగ కల్పన, ఔత్సాహిక వ్యాపారాలకు ఊతం, ఆరోగ్యం/ఆరోగ్యకర జీవనశైలి, క్రీడలు, సామాజిన విలువల ప్రోత్సాహం, అభివృద్ధిలో యువ సమాజాన్ని భాగం చేయడం, రాజకీయాల్లో/ ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం, యువజనులను పనిమంతులుగా మార్చడం, అన్ని వర్గాల యువతకు సమాన అవకాశాలు కల్పించడం, సామాజిక న్యాయం అనబడే 11 అంశాలను తీసుకొని ప్రభుత్వం పథకాలు రూపకల్పన చేయడం జరిగింది. 2014-15లో ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 24.3 ఉండగా 2019-20లో 27.1కి పెరగడం గమనించారు. ఉద్యోగ ఉపాధుల కల్పనలో 2015-17 మధ్య కాలంలో ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ పథకం ద్వారా 1.1 కోట్ల యువతకు ఉద్యోగ ఉపాధుల ద్వారా పని కల్పించబడింది. ఈ పథకం ద్వారా గత 6 ఏండ్లలో 15 లక్షల కోట్ల ఆర్థిక సహాయం చేశారు. ‘ప్రధానమంత్రి కుషల్ వికాస్ యోజన’ ద్వారా 19.86 లక్షల యువతకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇచ్చారు. గత దశాబ్దం కాలంగా ‘దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన’ ద్వారా 7 లక్షల గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చారు. ‘ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్’ ద్వారా లక్షల యువతకు ఉద్యోగ కల్పన జరిగింది. ‘పోషన్ అభియాన్’, ‘ఆయుష్మాన్ భారత్’, ‘పియం మాతృ వందన యోజన’ లాంటి పథకాల ద్వారా యువజనుల ఆరోగ్య సంరక్షణకు కృషి చేశారు. క్రీడల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో పలు పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా తొలి క్రీడా విశ్వవిద్యాలయం స్థాపిం చడం కూడా జరిగింది.
15 – 29 ఏండ్ల వయస్సు కలిగిన యువతలో వివాహాలకు విముఖత చూపే వారి సంఖ్య క్రమంగా పెరుగుటను జాతీయ యువజన పాలసీ-2014 నివేదిక తెలుపుతున్నది. 2011లో అవివాహిత యువత 17.2 శాతం ఉండగా 2019లో 23 శాతానికి పెరగడం గమనించారు. 2011 నుంచి 2019 వరకు అవివాహిత యువకుల సంఖ్య 20.8 శాతం నుంచి 26.1 శాతానికి పెరగగా యువతుల్లో 13.5 శాతం నుంచి 19.9 శాతానికి పెరగడం జరిగిందని నివేదిక స్పష్టం చేస్తున్నది. అవివాహిత యువత అధికంగా జె అండ్ కె, యూపీ, డిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు/యూటీల్లో ఉండగా అతి తక్కువగా కేరళ, తమిళనాడు, ఏపి, హిమాచల్, యంపీల్లో కనిపించాయి. బాల్య వివాహాలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ వివాహాలు కాని యువత సంఖ్య పెరగడానికి సరైన కారణాలను మాత్రం నివేదిక స్పష్టం చేయలేదు. 2019-20లో 15 ఏండ్ల లోపు కౌమారదశ యువతుల్లో 1.7 శాతం మందికి వివాహాలు జరుగగా 2005-06లో 11.9 శాతం యువతులకు వివాహాలు అయినట్లుగా గమనించారు. యువతుల్లో 52.8 శాతం యువతులకు 25-29 ఏండ్లలో వివాహాలు అయినట్లు తెలుస్తుంది. 2019-20 గణాంకాల ప్రకారం 25 ఏండ్లకు వివాహాలు అయిన పురుషులు 42.9 శాతం ఉండగా యువతులు 83 శాతం ఉన్నట్లు తేలింది.
2030 నాటికి భారత యువతను నైపుణ్య నిధిగా మార్చి దేశ సుస్థిర సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలనే సదుద్దేశంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వశాఖ అన్ని అంశాలను జోడించి ఈ ముసాయిదా తయారు చేసింది. ‘జాతీయ యువజన పాలసీ-2021’లో విద్య, ఉద్యోగ వ్యాపారాలు, యువ నాయకత్వ అభివృద్ధి, ఆరోగ్యం, శారీరక పటిష్టతకు క్రీడలు, సామాజిక న్యాయం అనబడే ముఖ్యమైన 5 అంశాలను ముసాయిదాలో పొందుపరిచారు. యువభారతానికి కాలానుగుణంగా సరైన విద్యను అందిస్తూ ఆయారంగాల్లో నైపుణ్యాలను పెంచడానికి, అన్ని వర్గాల యువతకు సమన్యాయం కల్పించడానికి పథక రచన చేశారు. యువత నైపుణ్యాలను బట్టి ఔత్సాహిక వ్యాపారులుగా మార్చుతూ సుస్థిరాభివృద్ధికి యువజనులు కృషి చేయనున్నారు. యువతలో ఉన్న అపార శక్తిని సన్మార్గంలోకి మారల్చడానికి యువ నాయకత్వ శిక్షణలు నిర్వహిస్తూ రేపటి నాయకులుగా రూపొందించుటకు పలు పథకాలు అమలు కానున్నాయి. యువత సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన క్రీడలను ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ వేదికల్లో జాతీయ పతాకం రెపరెపలాడేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాల యువతకు ప్రాధాన్యం ఇస్తూ, ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల యువతకు అదనపు చేయూతను ఇస్తూ సామాజిక సమ న్యాయం అందే విధంగా చర్యలు చేపట్టనున్నారు.
‘జాతీయ యువజన పాలసీ-2021’ ద్వారా భారతీయ యువతలో నిగూఢంగా దాగి ఉన్న అపార శక్తిని దేశ సమగ్రాభివృద్ధికి వాడుకుంటూ ప్రపంచ దేశాల ముందు యువభారతం సగర్వంగా నిలబడాలి కోరుకుందాం, యువశక్తిని నిర్వీర్యం కాకుండా చూసుకుందాం. నేటి యువతే రేపటి భవిత అని నమ్ముదాం.
కరీంనగర్ – 994970003