- రేపటి నుండి విద్యుత్ కార్యాలయాల ముందు ఆందోళన
- తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్
జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : రేపు సోమవారం నుండి రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్ తెలిపారు. శనివారం జగిత్యాల పట్టణంలోని పెన్షనర్స్ భవన్లో శనివారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్రంలో కాంట్రాక్టర్ల కోసమే పాలన కొనసాగుతుందని, ప్రభుత్వ పాలన సక్రమంగా లేదని కోదండ రామ్ విమర్శించారు. ప్రజాస్వామ్య బద్ధంగా లేదని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలతో రైతులు సతమతమవుతున్నారని అన్నారు. ప్రభుత్వం డిస్కమ్లకు బకాయి ఉండటం వల్ల వారు చేసేది లేక, విద్యుత్ తయారు చేసే, కొనుగోలు చేసే శక్తి లేక విద్యుత్ కోతలు విధిస్తున్నారని తెలిపారు. డిస్కమ్లకు బకాయి ఉన్న డబ్బులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తమ పార్టీ తరుపున రాష్ట్రంలోని అని విద్యుత్ భవనాల ముందు సోమవారం నుండి ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వలేదని, ఈ పరిస్థితి జగిత్యాలలో మరింత దయనీయంగా ఉందన్నారు. వెంటనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. కూతుర్లతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు జలపతి రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. వరదల్లో కొట్టుకుపోయిన జర్నలిస్ట్ జమీర్ కుటుంబానికి చేయూత నివ్వాలని కోరారు. అనంతరం బుగ్గరం మండలంలోని సాంబశివ గుట్ట రాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశార్ణు. ఆయన వెంట జిల్లా టీజేఎస్ అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఉన్నారు.