- బడ్జెట్లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయింపు
- వనదుర్గాదేవికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీష్ రావు
మెదక్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రతిఏడాది బడ్జెట్లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని వెల్లడించారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి హరీష్ రావు వనదుర్గాదేవికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుటూ..మెదక్ జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయరన్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడుపాయలకు ప్రతియేటా నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. ప్రజలంతా గర్వపడేలా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రం మరింత ముందుకు సాగుతున్నదని తెలిపారు. యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దామని, కొండగట్టు అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించామన్నారు. వేద పండితులు, బ్రాహ్మణులు, దేవాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిచేస్తున్నదని చెప్పారు. హిందుధర్మ పరిరక్షణ కోసం ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఏడుపాయలను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం మరింత ముందుకు సాగుతుందని, రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను తెలంగాణ సర్కార్ అభివృద్ధి చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు గర్వించేటట్టుగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి కృషిచేస్తున్నామన్న మంత్రి.. వేద పండితులు, బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పారు. దేవాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. వేద పండితుల నడుమ పూర్ణ కుంభంతో మంత్రికి, ఎమ్మెల్యేలకు ఛైర్మన్ బాలాగౌడ్ స్వాగతం పలికారు, అనంతరం వనదుర్గ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు.