ప్రయివేట్ టీచర్లకు నిత్యావసర వస్తువుల పంపిణీలో మంత్రి హరీష్రావు
కొరోనాతో మూతబడిన ప్రయివేట పాఠశాలలు, కళాశాలల పున:ప్రారంభంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుందనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు తెలిపారు. శనివారం సిద్ధిపేట పట్టణంలోని చంద్రమౌళి గార్డెన్స్లో శ్రీ సాయి అన్నపూర్ణ ట్రస్టు, సద్గురు శ్రీ మధుసూదన్ సాయి దివ్యానుగ్రహా ఆశీస్సులతో సిద్ధిపేట ప్రయివేట్ స్కూల్ టీచర్లకు దాదాపు వెయ్యి మందికి కిరాణా సామాగ్రి- నిత్యావసర సరుకులతో పాటు మంత్రి సొంత డబ్బులతో ఒక్కొక్కరికి 3 వేల రూపాయల విలువైన ఆరోగ్య-హెల్త్ కిట్స్ తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ మేరకు ఏ ఒక్క విద్యార్థి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఆకలితో ఉండకూడదనే దివ్య సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత అల్ఫాహార సేవ కార్యక్రమ వాహనాన్ని మంత్రి హరీష్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్రావు మాట్లాడుతూ…కొరోనా ఎఫెక్టుతో ఎన్నో రంగాలు కుదించుకు పోయాయని, ప్రపంచ, దేశ ఆర్థిక వ్యవస్థ 8 శాతం నుంచి 24 శాతానికి పడిపోయిందనీ, భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు పడిపోయిందన్నారు.
రాష్ట్రంలో 1.82 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే కొరోనా ప్రభావంతో అంచనా 50 వేల కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. కొరోనా ప్రభావంతో ప్రయివేట్ పాఠశాలలు, కళాశాలలు, ఇండస్ట్రీలు, ఎన్నో ప్రయివేట్ రంగ సంస్థలు, యాజమాన్యాలు రోడ్డుపై పడ్డాయనీ, ఆయా రంగాల్లో పనిచేసే కుటుంబాల పరిస్థితి చిన్నాభిన్నం అయ్యాయన్నారు. స్వచ్ఛ సిద్ధిపేట, ఆరోగ్య సిద్ధిపేటగా తీర్చిదిద్దేలా మీ సహకారం అందించాలని ప్రయివేట్ టీచర్స్, లెక్చరర్లను మంత్రి హరీష్రావు కోరారు.