- పురపాలక బడ్జెట్లో పదిశాతం గ్రీన్ ప్రణాళిక
- ప్రతి పట్టణానికి సానిటేషన్ ప్లాన్
- స్థానిక ప్రజలతో కలిసి పనిచేయండి
- మున్సిపల్ అధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశంపురపాలక బడ్జెట్లో పదిశాతం గ్రీన్ ప్రణాళిక
- ప్రతి పట్టణానికి సానిటేషన్ ప్లాన్
- స్థానిక ప్రజలతో కలిసి పనిచేయండి
- మున్సిపల్ అధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశం
పురపాలన పూర్తిగా పౌరుల ప్రయోజనాలే కేంద్రంగా జరగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. పురపాలనలో భాగంగా ప్రజలకు మరింత చేరువ కావాలని అధికారులకు మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన పురపాలక చట్టాన్ని ప్రతి ఒక్క మున్సిపల్ కమిషనర్ తన విధి నిర్వహణలో జాబ్చార్ట్గా పరిగణించాలని కోరారు. పురపాలకశాఖ కమిషనర్లు, కార్పోరేషన్ల కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…పట్టణ ప్రజలు అధికారుల నుంచి అద్భుతాలే ఆశించడం లేదని, కేవలం వారి ప్రాథమిక అవసరాలు తీర్చడానికి పౌర సేవలందిస్తే సరిపోతుందన్న భావంతో ఉన్నారని అన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా మనం పని చేయాలన్నారు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం పురపాలిక బడ్జెట్లో కనీసం పది శాతంతో గ్రీన్ ప్రణాళికలు పట్టణంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలు రూపకల్పన చేయాలన్నారు. ప్రతి పట్టణానికి శానిటేషన్ ప్లాన్ తో పాటు గ్రీన్ ప్లాన్ కూడా తయారు చేయాలని ఆదేశించారు. అధికార వికేంద్రీకరణ స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అదే స్ఫూర్తితో ప్రజలకు మరిన్ని పరిపాలన ఫలాలు అందాలన్న లక్ష్యంతో గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను కొత్తగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందాలంటే అధికారులు స్థానిక ప్రజలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నూతన పురపాలక చట్టంలోని పారిశుద్ధ్యం, పచ్చదనం, పౌర సేవలు, పురపాలనలో ఆన్లై•న్ సేవలు, టెక్నాలజీ వినియోగం, గ్రీవెన్స్ రిడ్రెస్సెల్, ఎలాంటి అవినీతికి తావులేకుండా భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పని చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ఉదయం 4:30 గంటలకే పట్టణ పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలన్నారు. దీంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణలో వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టే ప్రయత్నం చేయాలన్నారు. పట్టణాలు, కార్పొరేషన్లలో సాధ్యమైనన్ని ఎక్కువ పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు ప్రత్యేకంగా షీ టాయిలెట్ల నిర్మాణాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు అవసరమైన హెల్త్ ప్లాన్ తయారుచేసి ఉంచాలన్నారు. ఇందుకోసం అవసరమైతే వెటర్నరీ డాక్టర్లు, ఎంటమాలజిస్టులు ఇతర సిబ్బంది సహకారం తీసుకోవాలని సూచించారు.
అవినీతికి పాల్పడితే బర్తరఫ్:
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన పౌరసేవలు అవినీతి రహితంగా, అత్యంత పారదర్శకంగా ఉండాలన్న స్ఫూర్తితో అనేక నూతన చట్టాలు చేస్తున్నదన్నారు. అందులో భాగంగా పురపాలకశాఖలో తీసుకువస్తున్న టీఎస్ బిపాస్ ద్వారా 21 రోజుల్లో ప్రజలకి భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాల్సిందేనని, ఇందులో ఎలాంటి రాజీ ఉండబోదని మంత్రి కేటీఆర్ తెలిపారు. పురపాలనలో అవినీతి అరికట్టేలా కఠినమైన చట్టాలు, విధానాల రూపకల్పన చేస్తున్నామని, వీటి అమలులో కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రభుత్వం తన ప్రాధాన్యతలను ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఏ అధికారైనా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే సస్పెన్షన్ వంటి నామమాత్రపు చర్యలు కాకుండా విధుల నుంచి పూర్తిస్థాయిలో తొలగించే అత్యంత కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. నూతన భవన నిర్మాణ అనుమతుల పక్రియ అమలును హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మానిటర్ చేస్తామని తెలిపారు. పురపాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని, పౌరులతో సంబంధాలని పెంచుకునే విషయంలో మరింత చొరవ చూపించాలని కషనర్లను మంత్రి కేటీఆర్ కోరారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజలతో కలిసి పని చేస్తూ వారికి అపూర్వమైన సేవలందించి పట్టణాలపైన తనదైన చెరగని ముద్ర వేసే తీరుగా అధికారులు పనిచేయాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో తమందరికీ యాజమానులన్న విషయాన్ని గుర్తుంచుకొని, వారితో బాధ్యతయుతంగా ఉండాలన్నారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే అధికారులను, నాయకులను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని కేటీఆర్ అన్నారు. పురపాలనలో రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీలు, వివిధ రంగాల్లో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాయని, దీంతో పాటు జాతీయ స్థాయిలోనూ పలు నగరాలు వినూత్న విధానాలతో ముందుకు పోతున్నాయని వీటన్నిటిని పరిశీలించి వాటి స్ఫూర్తిగా స్థానికంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశానికి పురపాలకశాఖ విభాగాధిపతులతో పాటు నూతన కార్పోరేషన్ల కమిషనర్లు, పురపాలక సంఘాల మున్సిపల్ కమిషనర్లు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది హాజరయ్యారు.