- టీటీడీ ఈవో
- డాక్టర్ జవహర్ రెడ్డి
తిరుమల, సెప్టెంబర్ 15 : టీటీడీ స్థానికాలయాలు, టీటీడీ ఆధీనంలోకి వచ్చిన ఆలయాల్లో భక్తులు గోపూజ,వేద ఆశీర్వచనం చేసుకునే అవకాశం కల్పించాలని ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు. శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో బుధవారం సాయంత్రం ఈ ఆలయాల అభివృద్ధి పై సీనియర్ అధికారులు, ఆయా ఆలయాల డిప్యూటి ఈవో లతో ఈవో సక్ష నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానికాలయాలు, స్వాధీనం చేసుకున్న ప్రతి ఆలయంలో ఒక ప్రత్యేక సేవ ప్రారంభించాలన్నారు. కపిల తీర్థంలో వారణాసి, శ్రీ కాళహస్తి ఆలయాల తరహాలో సేవలు ప్రవేశ పెట్టాలని చెప్పారు.
ప్రతి ఆలయంలో ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేకంగా విధి, విధానాలు రూపొందించాలన్నారు. టూరిజం అధికారులతో మాట్లాడి ఈ ఆలయాలకు ప్యాకేజి బస్ లు నడిపేలా చేస్తే సుదూర ప్రాంతాల భక్తులు కూడా సందర్శిస్తారన్నారు. ఆయా ఆలయాలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న భూములను లీజుకు ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పారు. మిగిలిన భూములు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు లీజుకు ఇవ్వవచ్చునని ఈవో తెలిపారు. ప్రతి ఆలయానికి భక్తులు సులభంగా వెళ్లేందుకు వీలుగా అవసరమైన బోర్డ్ లు,ఎస్వీబీసీ లో ప్రోమోలు, చిన్న సైజు పుస్తకాలు ముద్రించాలని సూచించారు.
ప్రతి ఆలయానికి సంబంధించిన సమాచారం టీటీడీ వెబ్సైట్ లో పొందుపరచాలని ఈవో చెప్పారు. ఆలయాలకు వచ్చిన భక్తుల సంఖ్య, సేవలు, ఇంజినీరింగ్ పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. జెఈవో సదా భార్గవి, ఎఫ్ ఏ అండ్ సి ఏవో బాలాజి , చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, డిప్యూటి ఈవో జనరల్ రమణ ప్రసాద్, ఎస్టేట్ ఆఫీసర్ మల్లి ఖార్జున, వివిధ ఆలయాల డిప్యూటీ ఈవో లు శాంతి, పార్వతి, కస్తూరి బాయి పాల్గొన్నారు.