రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం
రాష్ట్ర ఎన్నికల సంఘం రాబోవు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ పరిధిలో నమోదై ఉండి ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ సిబ్బందికి, కోవిడ్ 19 వలన క్వారంటైన్లో ఉన్న వోటర్లు, వయో వృద్ధులకు ప్రయోగాత్మకంగా ఈ-వోటింగ్ ద్వారా వోటు హక్కు కల్పించడానికి నిర్ణయించిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఈ విషయంలో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలను, ఈ-వోటింగ్ ద్వారా వోటు వేయడానికి రిజిస్టర్ చేసుకునే విధానాన్ని, వోటింగ్ గోప్యత (సీక్రసీ ఆఫ్ వోటింగ్) నిబంధనలు పాటిస్తూ ఆన్లైన్లో వోటు వేసే విధానాన్ని ఐ టి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వారి సిబ్బంది మరియు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులతో కూలంకషంగా చర్చించారు.
సాధ్యమైనంత త్వరలో నిబంధనలు పాటిస్తూ సాఫ్ట్ వేర్ను పొందుపరచి డెమో ఇవ్వాల్సిందిగా వారిని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఐ టి శాఖ ముఖ్య కార్యదర్శిని ఈ-వోటింగ్ విధానాన్ని పాటించడానికి సంబంధిత మున్సిపల్ శాఖను సంప్రదించి ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు జారీ చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఈ-వోటింగ్ విధానం అమలు మరియు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోవు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో విస్తృత స్థాయిలో ఈ-వోటింగ్ విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీ జయసింహా రెడ్డి, ఐటి శాఖ మరియు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.