- ఢిల్లీ నేతల ప్రచారం కూడా ఫలించక•పోవడంతోనే అసహనం
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
బీజేపీ నాయకులకు రోజురోజుకు ఫ్రస్టేషన్ పెరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో మంత్రి హరీష్ రావు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… సోమవారం పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు బీజేపీ నాయకుల ధర్నా ఒక డ్రామా అని అన్నారు. పీఎం నరేంద్ర మోడీ, అమిత్ షాతో సహా ఢిల్లీ నేతలను తెచ్చి ప్రచారం చేయించిన ఫలితం లేకపోవడంతో వారిలో అసహనం పెరిగిపోతుందని పేర్కొన్నారు. ప్రజలు బీజేపీ నేతలను నమ్మక పోవడంతో సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ లబ్ది పొందాలని చూస్తున్నారు. ఫేక్ వార్తల ప్రచారంలో నోబెల్ బహుమతి ఉంటే ఆ నోబెల్ బహుమతి బీజేపీ పార్టీకి వస్తుందని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం ఎన్నికల రోజున ప్రముఖ టీవీ ఛానల్ లోగో వాడుకుని ఫేక్ ప్రచారం చేసి లబ్ది పొందాలని చూశారని తెలిపారు.
రేపు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం ప్రముఖ చాన్నాళ్ల లోగోలు వాడుకుని టీఆర్ఎస్ ప్రముఖ నేతలు బీజేపీలో చేరుతారని ప్రచారం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని మాకు విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. దయచేసి ప్రజాలేవరూ అలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దు. ఎవ్వరూ సర్క్యులేట్ చేయవద్దని సూచించారు. సోషల్ మీడియాను పూర్తి స్థాయి ఫేక్ మీడియాగా బీజేపీ మార్చివేసింది. బలమైన సోషల్ మీడియా స్థాయిని దిగజార్చిందని పేర్కొన్నారు. ఎంత మంది నేతలు వచ్చి ప్రచారం చేసిన హైదరాబాద్ నగర ప్రజలు నమ్మట్లేదని అర్థమయ్యి ఫేక్ వార్తలు ప్రచారం చేసి ప్రజలను అయోమయానికి గురిచేసే విధంగా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నాతో సహా ఇతర ముఖ్య నేతలపై తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ప్రజాలేవరూ ఆ వార్తలను నమ్మొద్దని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలేవరూ సంయమనం కోల్పోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే లు చింత ప్రభాకర్,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.