- హైదరాబాద్, వరంగల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు
- ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష
కిడ్నీ వ్యాధి ఉన్న ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు వెల్లడించారు. ఈమేరకు హైదరాబాద్, వరంగల్ నగరాలలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి హరీష్ రావు ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్, వరంగల్ నగరాలలో ఉచిత డయాలసిస్ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుతో పాటు రోగుల కోసం ఐదు బెడ్ల చొప్పున కేటాయించి ప్రత్యేకంగా వైద్య సేవలు అందించాలని సూచించారు.
ప్రభుత్వ ఆధీనంలో 43 డయాలసిస్ కేంద్రాలలో ప్రస్తుతం 10 వేల మంది రోగులకు సేవలు అందుతున్నాయనీ, ఇందుకోసం ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.100 కోట్లను కేటాయిస్తున్నదని చెప్పారు. వీరితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు సైతం ఈహెచ్ఎస్ కింద 43 ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాలలో ఉచితంగా సేవలు అందించాలని ఆదేశించారు. ఎక్కువ పేషెంట్ల వొత్తిడి ఉన్న డయాలసిస్ కేంద్రాలను గుర్తించి ఆ కేంద్రాలలో ఎన్ని డయాలసిస్ యంత్రాలు కొత్తగా అవసరమో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందాలన్నది సీఎం కేసీఆర్ ఉద్దేశ్యమనీ, దానికి అనుగుణంగా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆదేశించారు.