- నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ లు ఏమయ్యాయి
- పోడు రైతులను పట్టించుకున్న పాపాన పోవడంలేదు
- కౌలు రైతులను కష్టాలకు వదిలేశారు
- కెసిఆర్ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ నేత పొన్నం
తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని కేసీఆర్ అనేక సందర్భాల్లో ప్రకటనలు చేసిన మాట వాస్తవమా కాదా అని మాజీ ఎంపి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎందుకు క్యాలండర్ విడుదల చేయరని అన్నారు. అలాగే అన్యాక్రాంత భూమలుపై విచారణ జరపాలన్నారు. ఎక్కడెక్కడ అన్యాయంగా ఆక్రమించారో నిగ్గు తేల్చాలన్నారు. ఇకపోతే వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడం లేదన్నారు. విశ్వవిద్యాలయాల్లో లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాఎందుకనో భర్తీ చేయడం లేదన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో, సంస్థల్లో లక్షలాది మంది అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో ఏండ్ల తరబడి పని చేస్తున్నా, వారిని పర్మినెంట్ చేయడం లేదన్నారు. పర్మినెంట్ చేస్తామన్న హామీ ని కూడా కెసిఆర్ మరచారని అన్నారు. వారితో వెట్టి చేయించుకుంటూ చాలీచాలని వేతనాలను చెల్లిస్తూ అన్యాయం చేస్తున్నారు. మాకు న్యాయం చేయమని పోరాడిన వారి ఉద్యోగాలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. కొరోనా వేళ డాక్టర్లు, వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కరించడంలేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో భూసేకరణ కింద పేద, మధ్యతరగతి రైతుల నుంచి భూములు బలవంతంగా తీసుకొని, న్యాయమైన పరిహారం ఇవ్వక పోవడం విచారకరమన్నారు.
లక్ష కోట్లు ఖర్చు పెట్టి కోటి ఎకరాలకు సాగునీరందిస్తామని, అనేక ప్రాజెక్టులకు రీడిజైన్, రీ ఎస్టిమేట్స్ చేసి ఇప్పటికే వేల కోట్లు ఖర్చు పెట్టారని పొన్నం అన్నారు. పేద గిరిజనులకు ముఖ్యంగా పోడు భూములకు పట్టాలు ఇస్తామన్న హావి• నెరవేర లేదన్నారు. ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని కల్పించిన ఆశ నిరాశగానే ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమసయంలో మాట్లాడిన మాటలకు పాలనకు పొంతన లేకుండా పోయిందని విమర్శించారు. ఇదేనా ఈ ప్రాంత ప్రజలు కోరుకున్నదని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మె, అంగన్వాడీ, మున్సిపల్ వర్కర్స్, ఆయాలు చేసిన సమ్మెలపై ఉక్కుపాదం మోపి లొంగదీసుకున్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను హరిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరు నిజాం పాలనను తలపిస్తోందని అన్నారు.
నియంతృత్వ పోకడలను మానుకోవాలని అన్నారు. ఈ ఆరేళ్లలో లోపాలను సవి•క్షించుకుని , సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తేనే ప్రజల్లో మన్నన ఉంటుందన్నారు. తెలంగాణ ఆవిర్భవించి ఏడేండ్లు పూర్తయినా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి న్యాయం జరగలేదన్నారు. బంగారు తెలంగాణగా పేరుతో దగా చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కెసిఆర్ ఎక్కడ ఉండేవారన్నారు. రాష్ట్రంలో కౌలు రైతులు సుమారు 20 లక్షల మంది వరకూ ఉంటారని వారిని ఆదుకోవడానికి ఎలాంటి పథకం చేపట్టలేదన్నారు. శాసనసభ సాక్షిగా కౌలురైతులను గుర్తించమనీ, గుర్తింపు కార్డులు ఇవ్వమనీ కరాఖండిగా తేల్చి చెప్పారని, కనీసం వారిని ఆదుకోవాలన్న ధ్యాస కూడా పెట్టడం లేదన్నారు. ఈ సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈటెల వ్యవహారమన్నారు. ధరణితో సమస్యలు పెరిగాయే తప్ప తగ్గలేదన్నారు.