తెలంగాణ రాష్ట్రంలోని మారు మూల గ్రామం. చిన్న గిరిజన వ్యవసాయ కూలి కుటుంబం. పసి కూన వయస్సు 13 ఏళ్ళు. పేరు మాలవత్ పూర్ణ. సాధించిన ప్రప ంచ రికార్డు ఊహక ందనిది. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన బాలికగా ప్రపంచ రికార్డు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఏడు అతి ఎత్తైన పర్వతలను అధిరోహించాలనే స్వప్నం సాకారం కావడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇప్పటికే ఆరు ఖండాల్లోని ఆరు ఎత్తైన పర్వతాలను అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసింది మన చిచ్చర పిడుగు. పూర్ణ అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా ప్రపంచ ప్రఖ్యాత ‘ఫోర్బస్ జాబితా’లో చోటు దక్కించుకుంది మన తెలంగాణ ముద్దు బిడ్డ. ‘‘స్వయంకృషితో ఎదిగిన భారత మహిళలు-2020‘‘ ( సెల్ఫ్ మేడ్ ఇండియన్ వూమన్-2020) ఫోర్బస్ జాబితాలో మన పూర్ణకు సుస్థిర స్థానం దక్కడం మనందరికి గర్వకారణం. ఆడ పిల్లంతే ఆడది (అత్తారింటి) అని కాకుండా, తన స్వయంకృషితో ఎవరూ ఊహించని పర్వతారోహణ రంగంలో 13 ఏళ్ళ నుండే శిక్షణ తీసుకుంది.
మాలవత్ పూర్ణ 13 ఏళ్ళ 11 నెలల వయస్సులో 25 మే 2014న మౌంట్ ఎవరెస్టును అధిరోహించి ప్రపంచ రికార్డు సాధించింది. మాలవత్ పూర్ణ రెట్టించిన ఉత్సాహంతో 2016లో ఆఫ్రికా ‘‘మౌంట్ కిలిమంజారో’’ పర్వతం, 2017లో యూరప్లోని ‘‘మౌంట్ ఎల్బ్రుస్’’ పర్వతం, 2019లో దక్షిణ అమెరికాలోని ‘‘మౌంట్ అకొంకాగ్వా’’ పర్వతం, 1019లో ఓసియానియా ప్రాంత ‘‘మౌంట్ కార్టస్ నెజ్’’ పర్వతం మరియు 26 డిసెంబర్ 2019న అంటార్కిటికాలోని ‘‘మౌంట్ విన్సన్ మసిఫ్’’ పర్వతాన్ని (ఎత్తు 4,987 మీటర్లు) అధిరోహించి జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి జాతీయ గీతాలాపన చేసింది. 18 ఏళ్ళ వయస్సులోనే ఆరు ఖండాల్లో ఆరు ఎత్తైన పర్వతాలు అధిరోహించిన ప్రథమ మహిళగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఏడు ఖండాలలోని ఏడు అతి ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఉత్తర అమెరికాలోని (అలస్కా ప్రాంత) ఎత్తైన ఏడవ ‘‘మౌంట్ దీనలి‘‘పర్వతాన్ని అధిరోహించాలనే ప్రయత్నంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్? జిల్లా సిరికొండ మండలం పాకాల (తాడ్వాయి) గ్రామంలో 10 జూన్ 2000 రోజున పేద గిరిజన వ్యవసాయ కూలి కుటుంబంలో జన్మించిన మాలవత్ పూర్ణ చిన్నతనం నుండే అడవిలోని గుట్టలు, కొండలను ఆడుతూ పాడుతూ ఎక్కేది.
తెలంగాణ సాంఘీక సంక్షేమ ఆవాస విద్యా సంస్థలో చదువుకుంది. పూర్ణ ప్రతిభను గుర్తించిన సంస్థ కార్యదర్శి ఐపియస్ అధికారి డా: ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ ప్రోత్సాహంతో ‘ఆపరేషన్ ఎవరెస్టు’కు ఎంపికై పర్వతారోహణలో కోచ్ శేఖర్ బాబు నేతృత్వంలో శిక్షణ పొందింది. శిక్షణలో భాగంగా లడక్ మరియు డార్జీలింగ్ ప్రాంత పర్వతాలను అధిరోహించింది. ప్రస్తుతం అమెరికాలోని మిన్నసోట స్టేట్ యునివర్శిటీలో అండర్గ్రాడ్యుయేషన్ ఉన్నత విద్య చేస్తున్నది. ఇప్పటి నుండి పూర్ణ పర్వతారోహణలో వేసే ప్రతి అడుగు ప్రపంచ రికార్డు కానుంది. ప్రపంచ పర్వతారోహణ చరిత్రలో తెలంగాణ తెలుగు పూర్ణ పేరు సువర్ణాక్షరాలలో లిఖించబడింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు సాంఘీక సంక్షేమ రెసిడెన్సియల్ విద్య సంస్థల కార్యదర్శి డా: ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ల నిరంతర ప్రేరణ మరియు ఆర్థిక సహాయంతో ప్రపంచంలోనే ఉత్తమ పర్వతారోహితురాలుగా మాలవత్ పూర్ణ తెలంగాణకు ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టింది. మాలవత్ పూర్ణ ప్రేరణాత్మక జీవిత విశేషాలను కేంద్రంగా చేసుకొని అపర్ణ తోట రచించిన జీవిత చరిత్ర ‘‘పూర్ణ’’ పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. బాలివుడ్ నటుడు దర్శకుడు రాహుల్ బోస్ 2017లో మాలవత్ పూర్ణ బయోపిక్‘‘పూర్ణ – కరేజ్ హాజ్ నో లిమిట్’’ సినిమాను తీశారు. నిర్దిష్ట లక్ష్యసాధన దిశగా అడుగులు వేయడం ప్రారంభిస్తే భయం పారిపోయి గమ్యం దగ్గరవుతుందని నమ్మే మన మట్టిలో మాణిక్యం మాలవత్ పూర్ణ జీవితం నేటి యువతకు సదా ఆదర్శం కావాలి. పేదరికం ఎదగడానికి అవరోధం కాదని, దృఢ చిత్తంతో ఏదైనా సాధించవచ్చని రుజువు చేసింది మన ప్రపంచ రికార్డు నెలకొల్పిన పూర్ణ. ఉన్నత విద్యను పూర్తి చేసిన తరువాత సివిల్ సర్వీసు పరీక్షలో నెగ్గి ఐపియస్ అధికారిణిగా సేవలను అందించాలనే మాలవత్ పూర్ణ లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిద్దాం, నిండు మనసుతో దీవిద్దాం.

జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్ – 99497 00037