- 70 ఏళ్ల సమస్యలకు మోడి ప్రభుత్వం పరిష్కారాలు చూపింది..
- పోతిరెడ్డి’ పై తెలుగు సీఎంలు సామరస్యంగా మాట్లాడుకోవాలి
- ప్రతి ఇల్లు, ప్రతి ఊరులో లాక్ డౌన్ కొనసాగాలి
- తెలుగు బిడ్డగా ఇరు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్రంలో బిజేపి సర్కార్ 2.0 తొలి ఏడాది తెలుగు ఉగాది పచ్చడిలోని షడ్ రుచుల మేలవింపుగా ఉందని కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గడిచిన ఏడాది కాలంలో ప్రధాని నరేంద్ర మోడి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. 70 ఏళ్లుగా దేశాన్ని పట్టిపీడిస్తోన్న సమస్యలను పరిష్కరించడంలో బిజేపి ప్రభుత్వం విజయం సాధించిందని, ఆ నిర్ణయాల్లో కేంద్ర మంత్రి గా తాను సైతం భాగస్వామిగా ఉన్నందుకు గర్విస్తున్నా అన్నారు. మోడి సర్కార్ రెండవ సారి అధికారంలోకి వచ్చి తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా… కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం మీడియాతో ముచ్చటించారు. ఎలాంటి వ్యతిరేకత లేకుండా త్రిపుల్ తలాక్ రద్దు చేసిన మోడి, ముస్లిం మహిళలకు సోదరుడిగా మారారన్నారు. ఒక రక్తపు ఒట్టు చిందకుండా జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని తొలగించి ఆర్టికల్ 370 ని రద్దు చేయడంలో బిజేపి సర్కార్ విజయం సాధించిందన్నారు. ఈ నిర్ణయం తర్వాత కాశ్మీర్ లో రాళ్లు రువ్వడం, సామన్య ప్రజలతో పాటు, భద్రతా బలగాలపై ఉగ్రవాదుల దాడులు తగ్గాయని చెప్పారు. కాశ్మీర్ వదిలి వెళ్లిపోయిన దాదాపు 6 వేల మందిని తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లే ధైర్యాన్ని కల్పించామని తెలిపారు. కాశ్మీర్ లో జాతీయ జెండాను తగలబెట్టడం, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసినట్లు వివరించారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి, ప్రజాస్వామ్య చట్టాలను అమలు పరుస్తున్నామన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు ధృడ నిశ్చయంతో మోడి సర్కార్ నిర్ణయాలను అమలు చేస్తుందన్నారు. ఉగ్ర వాదాన్ని పెంచిపోశిస్తున్న పాకిస్థాన్ ను ప్రపంచ దేశాల ముందు ఏకాకిని చేయడంతో కేంద్ర ప్రభుత్వం గెలిచిందన్నారు. సిటిజన్ అమైండ్మెంట్ చట్టం అవసరాన్ని మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కమ్యూనిస్ట్ లు, ఇతర పార్టీల నేతలు అనేక మార్లు ప్రస్తావించారని, అయితే, ఈ చట్టాన్ని చేసే సాహసాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు చేయలేదని దుయ్యబట్టారు. దాదాపు 30 ఏండ్లకు పైగానే, కాంగ్రెస్ హయాంలో దేశానికి శరనార్ధులుగా వచ్చిన వారికి బిజేపి సర్కార్ సిటిజన్ షిప్ ను ఇచ్చిందన్నారు. దేశంలో 99 శాతం నగరాలు ఓడిఎఫ్ ఫ్రీగా గుర్తించబడ్డాయని పేర్కొన్నారు.
కిసాన్ సమ్మాన్ యోజన లో రైతులకు 2 వేల ఆర్థిక సాయం, చిన్న వ్యాపారులు, అసంఘటిత కార్మికులు, రైతులకు పించన్లు, ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీ, తొలి ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలే అని ప్రకటించారు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా భారతీయ ఆస్తులు, భారతీయులపై జరిగే ఉగ్రదాడులను దర్యాప్తు చేసేలా ఎన్ ఐఏ కు అధికారాలు ఇచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అమెరికాకు చెందిన ఇంటర్ పోల్ మాదిరిగానే, ఈ వ్యవస్థ ఆయా దేశాల పోలీసులతో కలిసి పని చేస్తుందన్నారు. మానవ అక్రమ రవాణను అరికట్టే బాధ్యత, దొంగనోట్లు, ఆయుధాలు, మారక ద్రవ్యాలు అక్రమ రవాణాపై దర్యాప్తు చేసే పూర్తి అధికారం ఈ సంస్థ కు ఉందన్నారు. ఉగ్ర సంస్థలనే కాకుండా, వారికి సహకరిస్తోన్న వ్యక్తులను ఉగ్రవాదులుగా గుర్తించే చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) బిల్లుకు పార్లమెంట్ ఆమోదం ఉందని గుర్తు చేశారు. ఇకపై ఇతర దేశాల నుంచి భారత్ లో ఉగ్రదాడులు చేసే వారిని, ఆ దేశమే భారత్ కు అప్పగించేలా ఈ చట్టంలో పొందుపరిచినట్లు చెప్పారు. ఆయుధాల లైనెస్స్ ల క్రమబద్దీకరణలో కేంద్ర హోం శాఖ మార్పులు చేసిందన్నారు. గతంలో ఒక్కరి వద్ద దాదాపు తొమ్మది వరకు ఆయుధాలు ఉంటే, ప్రస్తుతం వాటిని రెండుకు తగ్గించామన్నారు. పాకిస్థాన్ లోని గురు నానక్ ఆలయ దర్శనం, అమర్ నాథ్ యాత్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం భద్రతా, రక్షణ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో బోడో పీపుల్ ఫ్రంట్ తో పాటు, దాదాపు 88 తిరుగుబాటు దళాలు ప్రభుత్వం ముందు లొంగిపోయేలా చర్చలు జరపడంలో కేంద్రం విజయం సాధించిందన్నారు. దీంతో వేలాది మంది సాయుధులు ఆయుధాలు విసర్జించే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజాస్వామ్యం విధానంలో చేరారని గుర్తు చేశారు. త్రివిధ దళాలను ఒకే వేదికపైకి తెస్తూ, భారత రక్షణ సామర్థ్యాన్ని పెంచేలా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ ను పదవి ని నెలకొల్పామన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి, దాని ప్రభావంపై ఏ లెక్కన చూసినా… భారత్ బెటర్ గానే ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అయినప్పటికీ, దేశంలో లాక్ డౌన్ ఎత్తి వేసినా… ప్రతి ఇంట్లో, ప్రతి ఊళ్లో ఆ స్పిరిట్ ను కొనసాగించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచంలో 200 దేశాలు ఈ వైరస్ బారినడి ఇబ్బందులకు పడుతున్నాయని గుర్తు చేశారు. ఈ వైరస్ మన దేశంలో, మన వైఫల్యంతో పుట్టింది కాదని చెప్పారు. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం దూరదృష్టి నిర్ణయాలు, ఆలోచనలతో వేరే దేశాలతో పోలిస్తే, పాజిటీవ్ కేసులు, మరణాల సంఖ్య చాలా తేడా ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ ఓ), అమెరికా, ఇతర దేశాలు భారత్ నిర్ణయాలను అభినందిస్తున్నాయన్నారు. ఏ కొలమానంతో చూసినా భారత్ మెరుగ్గానే ఉందన్నారు. ప్రజల ప్రాణాలు, ఆర్థికం రంగం కేంద్ర ప్రభుత్వం రెండు కళ్లుగా భావించి ముందుకు వెళ్తుందన్నారు. అపజయం అన్న చోట, విజయాలను లిఖించగల శక్తి ప్రధాని మోడికి ఉందని వ్యాఖ్యానించారు. కోవిద్ 19, ఉగ్రవాదం, వాతావరణ సమతుల్యం లో భారత్ ప్రపంచానికి దిక్సూచిలా పని చేస్తుందన్నారు. కరోనా విళయతాడవంతో ప్రపంచ దేశాల వ్యవస్థలకు కుప్పకూలిన సందర్భంలో, భారత్ దాదాపు 54 దేశాలకు హెచ్ సీక్యూ మందుల సరఫరాలో సహాయం అందిస్తోందన్నారు.ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్, వామ పక్షాలు పార్టీలు నామ మాత్రమే అని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ పార్టీలు చేసే విమర్శల్లో స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. యూపీఏ రెండు దఫాల పదేళ్ల పాలనలో బొగ్గు కుంభకోణం, కామన్ వెల్త్, 2జి స్పెక్టం కుంభకోణాల్లో రూ. 10 లక్షల కోట్లకు పైగా అవినీతి జరిగిందన్నారు. ఆ తప్పులతో జరిగిన నష్టాన్ని సరిదిద్దుకుంటూ బిజేపి ముందుకు వెళ్తుందని చెప్పారు. కరోనా విపత్కర కాలంలో రాజకీయ పార్టీలు, స్వచంద సంస్థలు కేంద్రంతో కలిసి నడవాలని కోరారు. అయితే, కొన్ని పార్టీలు కోడి గుడ్డుపై ఈకలు పీకుతున్నాయంటూ నిప్పులు చెరిగారు. లాక్ డౌన్ పై రాహుల్ గాంధీ విమర్శలు పొంతన లేకుండ ఉన్నాయని మండిపడ్డారు. మొదట లాక్ డౌన్ విధించాలని, ప్రస్తుతం లాక్ డౌన్ తో ఏం లాభం అంటూ రాహుల్ విమర్శించడం ఆయన అవగాహన లోపానికి అద్దంపడుతుందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే ముందుగా లాక్ డౌన్ పై నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది వలస కూలీలు కాలిబాటన సొంతూళ్లకు బయలు దేరారని, మానవీయ కోణంలోనే వారికోసం శ్రామిక్ రైళ్లు, రవాణ వ్యవస్థను ప్రారంభించినట్లు చెప్పారు. లాక్ డౌన్ కారణంగా దేశంలో 90 శాతం జనాభ కరోనా పై పోరాడేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. కానీ, పది శాతం మంది నిరక్షరాస్యత కారణంగా అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఏపి, తెలంగాణ ల మధ్య 70 ఏళ్లుగా నీళ్ల తగాదా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డి పై ఇరు రాష్ట్రాల సీఎం లు కూర్చోని సామరస్యంగా మాట్లాడుకుంటే పరిష్కారమవుతుందన్నారు. యోగ క్షేమాలు, అనేక కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్న ముఖ్యమంత్రులు నీళ్ల వాటా, ప్రాజెక్ట్ ల విషయంలోనూ కలిసి మాట్లాడుకుంటే సరిపోతుందన్నారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఇరు ప్రాంతాల నేతలు, పార్టీల మధ్య నీళ్ల విషయంలో గొడవలు జరిగాయని గుర్తు చేశారు. 10 ఏళ్లు శాసన సభ్యుడిగా నీళ్ల విషయంలో అసెంబ్లీలో పోరాడినట్లు చెప్పారు. కాళేశ్వరానికి జాతీయ హోదా అనే అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దేశంలో పేద రాష్ట్రాలైన బిహార్, యూపీలకు అనేక రకాల ప్రాజెక్ట్ లు అవసరమన్నారు. అయినా, కేంద్ర ఎక్కడా జాతీయ ప్రాజెక్ట్ లను ఇవ్వలేదని, అవకాశం ఉంటే ఆయా రాష్ట్రాలతో పాటు, తెలంగాణ కు న్యాయం చేస్తామని చెప్పారు. వలస కార్మికుల యోగ క్షేమాలు, ఆహారం, రవాణ చార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి చెల్లిస్తున్నాయని వెల్లడించారు. కేంద్రమే సొంతంగా డబ్లు చెల్లించడం, వలస కూలీల అవసరాలను తీర్చాలంటే పెద్ద ఎత్తున సమస్యలు ఉత్పన్నమవుతాయని వివరించారు. అందువల్ల రాష్ట్రాలకు కేంద్రం డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల్ని సమకూర్చిందని తెలిపారు. ఇందులో తెలంగాణ కు రూ. 222 కోట్ల ను ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఒక ప్రత్యేక రైలు నడపాలంటే 30 నుంచి 35 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఇలాంటి సందర్బంలో రాష్ట్రాలు వారికిచ్చిన నిధుల్ని కొద్ది కొద్దిగా రైల్వేకు చెల్లిస్తున్నాయన్నారు. ఇక కేంద్ర పథకాల వినియోగించుకోవడంతో తెలంగాణ వెనకబడిందన్నారు. ముఖ్యంగా ఆయూష్మాన్ భారత్ లో తెలంగాణ ను చేర్చకపోవడంతో, ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిద్ 19 పేషెంట్లు ఉచితంగా చికిత్స పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ స్కీం కింద ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలు కేంద్రం అందిస్తోన్న ఆరోగ్య పథకాలను పొందలేకపోతున్నారని మండిపడ్డారు. ఏపి సర్కార్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీం ను మెరుగ్గా ఉపయోగించుకుందని, అయితే, తెలంగాణ సర్కార్ మాత్రం తొలి విడతలో ఇచ్చిన 2 లక్షల ఇండ్ల లబ్దిదారుల సమాచారాన్ని కేంద్రానికి అందించలేదన్నారు. దీని వల్ల పిఎం ఆవాస్ యోజన రెండో దశ నిధులు రావడం లేదన్నారు. తెలుగు బిడ్డగా ఇరు రాష్ట్రాల్లో అభివృద్ధికి కేంద్ర మంత్రిగా తనవంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. గడిచిన ఏడాది కాలంలో ఏపి, తెలంగాణ లో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు తాను సహకరించినట్లు చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో కోవిద్ 19 టెస్ట్ లకు కావాల్సిన ల్యాబ్ ను, ఈఎస్ ఐ ఆసుపత్రి, రోడ్ల నిర్మాణాలకు తనవంతు పాత్ర పోషించానన్నారు. భవిష్యత్ లోనూ ఇదే ఉత్సాహాం, చిత్త శుద్దితో పని చేస్తానని ప్రజలకు హామి ఇచ్చారు.