తండ్రి, కొడుకు కలిసి రూ.50వేల కోట్లు సంపాదించారు
ప్రజాతంత్ర బ్యూరో, సిద్ధిపేట: కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కలిసి 50వేల కోట్ల రూపాయలు సంపాదించారనీ ఆరోపించారు. దీనిపై బిజెపికి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి చెప్పినా కూడా పట్టించుకోలేదన్నారు. కాలేశ్వరం మొత్తం బూటకం. అక్రమ ఆస్తులు సంపాదించుకోవడానికే కాలేశ్వరం ప్రాజెక్టు అని… రాష్ట్రంలో తండ్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్దే హవా నడుస్తుందన్నారు. సిద్దిపేటలో హరీష్ రావుకే స్థానం లేదన్నారు. గత ఎంపి ఎన్నికలలో అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎంతో విర్రవీగారనీ, సారు…కారు..పదహారు సీట్లంటూ ఊదరగొట్టారనీ చివరకు టిఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితనే నిజామాబాద్ ఎంపి స్థానంలో ఓడగొట్టుకున్నారనీ ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లాలోని చేర్యాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఎంపి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. చేర్యాల పట్టణం ఏమాత్రం అభివృద్ధి జరగాలన్నా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలన్నారు. అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. తెలంగాణ వచ్చాక చేర్యాల అనాధగా మారిందనీ, పోరాటాల చరిత్ర ఉన్న చేర్యాలను టిఆర్ఎస్ పార్టీ నేతలు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. చేర్యాల రెవిన్యూ డివిజన్ కొరకు ప్రజలు ఎంతో కొట్లాడరనీ, అయితే ముఖ్యమంత్రికి గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్ల తప్ప మిగతా ఏ ప్రాంతాలు కనబడటం లేదన్నారు. జనగామ, చేర్యాల ప్రాంతాలను కేసీఆర్ మోసం చేస్తుండనీ, జనగామ ప్రాంతం కరువు ప్రాంతమనీ, చేర్యాల మున్సిపాలిటీ చేశారే కానీ….అభివృద్ధి ఏది అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సొంతూరు చింతమడకలో ఇంటికో 10లక్షలు ఇచ్చారనీ, పక్కనే ఉన్న చేర్యాల ప్రాంత వాసుల బాధలు మాత్రం అగుపించవన్నారు.
చేర్యాలలో పేదవారికి ఒక్క ఇల్లు అయిన కట్టించవా?అని ప్రశ్నించారు. రైతుబంధు, దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో గద్దెనెక్కి మోసం చేస్తున్నావనీ ప్రశ్నించారు. చేర్యాలలో 3కోట్లతో రోడ్లు అభివృద్ధికి సహకరించామనీ, 10 లక్షలతో పెద్ద చెరువుకు ఎంపీ నిధుల కింద ఇచ్చామనీ, ఈ మునిసిపల్ ఎన్నికలు చేర్యాల ఆత్మగౌరవ ఎన్నికలన్నారు. 500కోట్లు పెట్టి ప్రగతి భవన్.. 100కోట్లు పెట్టి ఫామ్ హౌస్ను కట్టుకున్న సిఎం కేసీఆర్కు పేదల ఇండ్లు మాత్రం గుర్తుకు రావడం లేదన్నారు. తండ్రి కొడుకులు 50 కోట్లు అక్రమ ఆస్తులు సంపాదించారు..! లేదు..మొత్తం తండ్రి,కొడుకులదే నడుస్తుంది.తెలంగాణలో ఉద్యోగులకు పిఆర్సి ఇవ్వకుండా ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. చేర్యాలలో మినరల్ వాటర్ ప్లాంటును ఏర్పాటు చేస్తామన్నారు. చేర్యాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే చేర్యాల రెవిన్యూ డివిజన్ కోసం పోరాడుతామన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి,మంత్రి దయాకర్ రావు వచ్చినా ఇక్కడ అడగుపెట్టనియ్యమన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు 100 కోట్లు ఇస్తే..ప్రాజెక్టు పూర్తియ్యి.. నీళ్లు వచ్చేవన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున చేర్యాల మునిసిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా ఉడుముల ఇన్నమ్మను ఎంపి కోమటిరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి, మద్దూరు జడ్పిటిసి గిరి కొండల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Father and son, 50 thousand crores, Mp komati Reddy, cm kcr and ktr, siddipet