- నాటి దండి సత్యాగ్రహం స్ఫూర్తితో ఉద్యమానికి పదును
- సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పాల్గొంటున్న రైతులు
- గాజీపూర్ సింగు బోర్డర్లో మట్టి కుండలతో ప్రదర్శనలు
సింగు బార్డర్ వద్ద రైతులు తలపెట్టిన మిట్టి సత్యాగ్రహ(మట్టి సత్యాగ్రహం) అనే నిరసన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా రైతులు భాగం పంచుకున్నారు. బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆనాడు భారతదేశ నలుమూలల గ్రామస్తులు ఒక పిడికిలి ఉప్పును చేతపట్టి ఏప్రిల్ 6న 1930లో ఉప్పు సత్యాగ్రహం తలపెట్టారు. ఈ మహా నిరసన వార్షికోత్సవం రోజున వేలాది గ్రామాల రైతులు తమ పొలాల నుండి మట్టిని ఢిల్లీకి పంపడం ద్వారా కార్పొరేట్ వ్యవసాయ చట్టాలపై తమ వ్యతిరేకతను చాటి చెప్పాలని చిన్న కుండలలో మట్టిని దేశం నలుమూలల నుంచి పంపించారు. ఈ కార్యక్రమం మేధా పట్కర్, డాక్టర్ సునీలం, రాకేశ్ టికైట్, యోగేంద్ర యాదవ్, డాక్టర్ దర్శన్ పాల్, తదితర ప్రముఖుల నేతృత్వంలో ఘాజిపూర్.. సింగు సరిహద్దులలో బహిరంగ సభలలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసనకు సంఘీభావంగా పలు రాష్ట్రాల నుంచి మట్టి ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల నుండి కూడా రైతులు మట్టిని పంపించారు. ఏఐకెఎస్సిసి జాతీయ వర్కింగ్ గ్రూప్ సభ్యుడు విస్సా కిరణ్కుమార్ నేతృత్వంలోని రైతు స్వరాజ్య వేదికా(ఆర్ఎస్వి) బృందం, బి.కొండల్, పి.శంకర్, కె.సాగరికా, ఎస్.ఈశ్వరయ్యలతో కూడిన బృందం తెలంగాణ మరియు ఆంధప్రదేశ్ 150 గ్రామాల నుండి మట్టిని ఈ నిరసనకు పంపించారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రైతాంగ ఉద్యమంలో మట్టి సత్యాగ్రహం ఒక ముఖ్యమైన నిరసనగా రూపుదిద్దుకున్నది. 1930లో ఏప్రిల్ 6 న జరిగిన ఉప్పు సత్యాగ్రహం దేశ వ్యాప్తంగా ప్రజలలో స్ఫూర్తిని నింపింది. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా సాగిన పోరాటం అది. అదే దండి సత్యాగ్రహం స్పూర్తితో కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై చేస్తున్న నిరసన ఉద్యమంలో భాగంగా దేశ నలుమూలల నుండి వేలాది గ్రామాలు ఈ మట్టి సత్యాగ్రహం కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ కార్పొరేట్ చట్టాలకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల రైతులు తమ గ్రామాల నుండి పంపిన మట్టి కుండలతో గాజీపూర్ సింగు బోర్డర్లో ప్రదర్శనలు నిర్వహించారు.
‘‘ఈ నిరసన కార్యక్రమం ప్రజలలో ఆసక్తిని పెంచింది. గ్రామాలలో వందలాది మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని మూడు కార్పొరేట్ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. మట్టి సత్యాగ్రహం ద్వారా ఈ ఉద్యమం దక్షిణ భారత దేశంలో వేలాది గ్రామాలలో బలోపేతం అయింది. ప్రజలు మనస్పూర్తిగా ఈ కార్యక్రమాన్ని బలపరిచారు’’ అని విస్సా కిరణ్ కుమార్ అన్నారు. ‘‘దేశంలో మరిన్ని రైతు ఆత్మహత్యలు జరగ కూడదని, రైతుల పంటలకు న్యాయమైన ధరలు లభించాలని ఈ పోరాటంలో పాల్గొంటున్నట్లు’’ రైతు ఆత్మహత్య బాధిత కుటుంబ సభ్యులు సాగరిక తెలిపారు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో రైతుల నుండి వొచ్చిన మద్దతు దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14 వరకూ కొనసాగించాలని (సంవిధాన బచావో ఆందోళన్ దివస్) నిర్ణయించి నట్లు రైతు స్వరాజ్య వేదిక నాయకులు కొండల్, శంకర్ ప్రకటించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, బీహార్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల నుండీ పెద్ద సంఖ్యలో రైతులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. జాతీయ నాయకులు ప్రదర్శన నుద్దేశించి మాట్లాడుతూ రైతు ఉద్యమం రోజు రోజుకూ మరింత బలోపేతం అవుతున్నదని, మూడు చట్టాలు రద్దయ్యే వరకూ కొనసాగుతుందని ప్రకటించారు. గ్రామాల నుండి మట్టిని డిల్లీకి పంపిన అన్ని గ్రామాల రైతులను నాయకులు అభినందించారు.