- పెరిగింది రైతుల ఆదాయం కాదు..సర్కారు, వారి స్నేహితుల ఆదాయం
- కేంద్రంపై రాహుల్ విమర్శ
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నామనే కేంద్ర ప్రభుత్వ వాదనలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం మరోసారి విమర్శించారు. వాస్తవానికి ‘సూట్, బూట్ సర్కార్’కు ఆదాయం సగానికి సగం పెరిగిందని, వారి మిత్రుల ఆదాయం నాలుగు రెట్లు పెరిగిందని ఆరోపించారు. కేంద్రం వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు దేశ రాజధాని సింఘు, తిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని వారు చెప్పారు.
వారు చేసిన పనితో ‘స్నేహితుల’ ఆదాయం నాలుగు రెట్లు పెరిగి.. రైతుల ఆదాయం సగానికి సగం అవుతుంది. ఈ సూటు-బూటు ప్రభుత్వం అబద్ధాలు, లూటీలకు చెందింది’ అంటూ ట్వీట్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి, వారి ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం వినిపిస్తుండగా..రైతులపై నీటి ఫిరంగులతో పోలీసులు దాడి చేస్తున్న ఓ వీడియోను కూడా రాహుల్ ట్వీట్ చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై దాడులు చేయకుండా..వెంటనే కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలని, నిరసనకారుల మనోవేదనను పరిగణనలోకి తీసుకోవాలని రాహుల్ డిమాండ్ చేసారు.