వికారాబాద్: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ లోని ఎన్నేపల్లిలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంటకు సాగు నీరు, పెట్టుబడికి సాయం, 24 గంటల కరెంట్, ప్రమాదవశాత్తు చనిపోతే రైతు బీమా వంటి అత్యున్నత పథకాలను తీసుకువచ్చిన మహానాయకుడుగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతాడని అన్నారు. వికారాబాద్ జిల్లాని గ్రీన్ జోన్ లోకి తీసుకురావడానికి అన్ని శాఖల అధికారులు కృషి చేస్తున్నారని, ప్రజలు కూడా అందుకు సహకరించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గుమికూడకుండా ఉండేందుకు రైతులకు టోకెన్లు ఇచ్చి టోకెన్ నంబర్ల ప్రకారం వారినుండి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.
ముఖ్యమంత్రి చెప్పినట్లు రైతులు పండించే పంటను చివరి గింజ వరకు కొనాలని, అందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరు ఆకలితో అలమటించకుండా వారికి నిత్యావసర వస్తువులు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ శివ రెడ్డిపేట పిఎసిఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, జిల్లా ఆడిట్ అధికారి లక్ష్మీనారాయణ, వికారాబాద్ ఎంపిడివో సుభాషిణి, కౌన్సిలర్ అనంత్ రెడ్డి, చిగుల్లపల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు.