ఇ-క్రాపింగ్ బుకింగ్ ద్వారా రైతుల పేర్లు నమోదు
అమరావతి, ఏప్రిల్ 24 : ధాన్యం సేకరణలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని, రైతులకు త్వరగా చెల్లింపులు కూడా జరగాలని సిఎం జగన్ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలన్నారు. ఆ రశీదు వెనుక రైతులనుద్దేశించి సూచనలు తప్పనిసరి గా ఉండాలన్నారు. నాణ్యతా ప్రమాణాలను కూడా అందులో పేర్కొనాలని సిఎం సూచించారు. రైతుల నుంచి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే, లేదా ధాన్యం కొనుగోలుకు అక్కడకు ఇక్కడకు వెళ్లమని ఎవరైనా చెప్తే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబరు 1967 కూడా తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. ధాన్యానికి మరింత ధర వచ్చేలా రైతులకు తగిన అవకాశాలు కల్పించాలని సీఎం అన్నారు. విదేశాల్లో డిమాండ్ఉన్న వంగడాలను సాగు చేయడంపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల ఎగుమతులు పెరిగి వారికి మంచి ధర వస్తుందన్నారు.
రైతులకు అవసరమైన వంగడాలు, వాటి విత్తనాలను అందుబాటులో ఉంచాలన్న సీఎం,ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక గోడౌన్ ఉండాలన్న కార్యాచరణ దిశగా ముందుకు సాగాలని సూచించారు. వ్యవసాయ సమస్యలు, అంశాలపై సిఎం జగన్ ఉన్నతస్థాయి సక్ష చేపట్టారు. ఈ సక్షలో రబీలో ఇ- క్రాప్ బుకింగ్పై సీఎంకు వివరాలు అందించిన అధికారులు, 48.02 లక్షల ఎకరాల్లో ఇ-క్రాప్ బుకింగ్ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. .97.5 శాతం ఇ క్రాపింగ్ పూర్తి చేశామన్న అధికారులు…ఇ- క్రాపింగ్ చేసుకున్న రైతులందరికీ కూడా డిజిటల్ రశీదులు, భౌతికంగా రశీదులు ఇచ్చామన్నారు. ఈ డేటాను సివిల్ సెప్లైస్ డిపార్ట్మెంటుకు, మార్కెటింగ్ డిపార్ట్మెంటుకు పంపించామని వెల్లడించారు.
3953 ఆర్బీకే స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు (సీహెచ్సీ)లకూ, 194 క్లస్టర్ స్ధాయి సీహెచ్సీలకూ మే 20లోగా వైయస్సార్ యంత్రసేవ కింద వ్యవసాయ ఉపకరణాలు అందిస్తున్నట్టు వెల్లడించారు. సీఎం యాప్ ద్వారా వివిధ ప్రాంతాలనుంచి, వివిధ పంటలకు వస్తున్న ధరలు, వాటి పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సిఎం సూచించారు. నిరంతరం మాక్ డ్రిల్ చేస్తూ… ఈ విధానం పనితీరును పర్యవేక్షించాలన్నారు. .ఎక్కడైనా లోపాలు ఉంటేం వెంటనే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సక్షా సమావేశానికి వ్యవసాయ, మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాలు, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.