అధికారులను అభినందించిన సిఎం జగన్
అమరావతి,జూలై 7 : రాష్ట్రంలో ఉపాధి హా అమలు తీరుపై సీఎం జగన్ అధికారులను అభినందించారు. మే నెలలో బాగా పని దినాలు కల్పించారని అన్నారు. మరిన్ని పనిదినాలు కల్పించడం పైన కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రూ.43 లక్షల కుటుంబాలకు రూ.4,117 కోట్లు ఉపాధి హా లేబర్ కాంపొనెంట్ కింద ఇవ్వగలిగామని సీఎం పేర్కొన్నారు. మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కరోనా కష్టకాలంలో ఇంతమేర పనులు కల్పించ గలగడం చాలా సంతోషకరం అని పేర్కొన్నారు.
కానీ మెటీరియల్ కాంపొనెంట్ విషయంలో కూడా కలెక్టర్లు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. అదేవిధంగా గ్రామ సచివాలయాల నిర్మాణం కోసం మిగిలిపోయిన చోట్ల స్థలాలను గుర్తించి వెంటనే నిర్మాణానికి అప్రూవల్స్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు 31 నాటికి అన్ని గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అలాగే రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ కోసం ఇంకా స్థలాలు గుర్తించని చోట వెంటనే స్థలాలను గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో దాదాపు 27 వేల చోట్ల సొంత భవనాలు లేవని, వాటికి కూడా నిర్మాణానికి స్థలాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలల్లో నాడు-నేడు పనుల్లో భాగంగా ప్రహరీ గోడల నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉందని, వాటన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు.