- జనవరి 31లోపు పూర్తి
- సంబంధిత శాఖల అధికారులకు సిఎస్ ఆదేశం
రాష్ట్ర ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో సెక్రటెరియట్, హెచ్ఓడిలు మరియు జిల్లా స్ధాయిలలో ఉద్యోగుల పదోన్నతులను ఎటువంటి జాప్యం లేకుండా జనవరి 31 లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులను, హెచ్ఓడిల ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం బిఆర్కెఆర్ భవన్లో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు మరియు కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ప్రమోషన్లతో పాటు కారుణ్య నియామకాల పక్రియను ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలన్నారు. ప్రమోషన్లు ఇవ్వడం వలన వొచ్చే ఖాళీలను కూడా ప్రత్యక్ష నియామాకాల నోటిఫికేషన్లలో చేర్చాలని ఆదేశించారు. ప్రమోషన్లు, కారుణ్య నియామకాలు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీ అంశాలపై ప్రతి వారంలో బుధవారం(జనవరి 6, 20, 27 తేదీలు) సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్ ప్రకారం అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడిలు ఈ అంశాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని హామి ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారులు అనురాగ్ శర్మ, కె.వి.రమణా చారి, ఎ.కె.ఖాన్, ఎస్.కె.జోషిలతో పాటు డిజిపి మహేందర్ రెడ్డి, పోలీస్ అధికారులు పూర్ణ చందర్ రావు, గోపి కృష్ణ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాణి కుముదిని, సురేష్ చందా, అధర్ సిన్హా, ముఖ్యకార్యదర్శులు రజత్ కుమార్, అర్వింద్ కుమార్, రామక్రిష్ణారావు, సునీల్ శర్మ, జయేష్ రంజన్, రవిగుప్తా, హర్ ప్రీత్ సింగ్, కార్యదర్శులు మరియు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.