ఎంసెట్ సహా ఎంట్రెన్స్ తేదీల ప్రకటన జులైలో నిర్వహించనున్నట్లు వెల్లడి
కరోనా కారణంగా నిలిచిపోయిన ఎంసెట్ సహా అన్ని ఇతర ఎంట్రెన్స్ పరీక్షల తేదీలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన ఈ పరీక్షలను లాక్ డౌన్ కారణంగా వాయిదా వేయగా.. తాజాగా జూలై లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో శనివారం నాడు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశమై.. ప్రవేశ పరీక్షలపై సక్ష నిర్వహించారు. కోవిడ్ హెల్త్ ప్రొటోకాల్, యూజీసీ సూచనలను పాటిస్తూ అన్ని ప్రవేశ పరీక్షలను జూలై నెలలో నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆమె చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎంసెట్ ఎగ్జామ్ ను జూలై 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అలాగే అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ప్రకటించింది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలన్నింటినీ ఆన్లైన్లోనే న్విహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జులై 6వ తేదీ నుంచి 9 వరకు ఎంసెట్, జులై 1న పాలిసెట్,జులై 4న ఈసెట్,జులై 13న ఐసెట్,జులై 15న ఎడ్సెట్,జులై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్,జులై 10న లాసెట్, లా పీజీసెట్ నిర్వహిస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.