- దోచుకో.. దాచుకో.. అన్న చందంగా పాలన
- డిజిటల్ సభ్యత్వ నమోదులో కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట, జనవరి 21 : తెలంగాణ ప్రభుత్వం సాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ లక్ష్యంగా పాలన సాగిస్తున్నదని నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని ఆయన జ్యోస్యం చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో దోచుకో..దాచుకో అన్న చందంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ నమోదు సవి•క్షా సమావేశానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.గీతారెడ్డి, నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు సంబురాలు వికారంగా ఉన్నాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితమే దేశ అభివృద్ధి అని, బీజేపీ మాదిరిగా దేశాన్ని రెండుగా విభజించి పాలించడం కాంగ్రెస్ పార్టీకి తెలియదని ఆయన విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయన్నారు. అనంతరం గీతారెడ్డి మాట్లాడుతూ.. కన్నీళ్ల రాష్ట్రంగా తెలంగాణ మారిందని, రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక్కడే తేలేదని ఆమె అన్నారు. ఎందరో అమరుల త్యాగ ఫలం సోనియాగాంధీ కృషి వల్లనే తెలంగాణ వచ్చిందని, సూర్యాపేట కాంగ్రెస్ సభ్యత నమోదు దేశంలోని ఆదర్శంగా ఉందని, కాంగ్రెస్ విజయాన్ని మోడీ, కేసీఆర్లు ఆపలేరన్నారు. దేశ భవిష్యత్తు కాంగ్రెస్ కార్యకర్తల చేతుల్లో ఉందని, జీవో 317 ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని ఆమె వెల్లడించారు.