- మార్చి 5కల్లా గ్రౌండింగ్ జరగాలి
- లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా రూ. 9.90 లక్షల నిధుల జమ
- రూ.10 వేలు దళిత రక్షణ నిధి
- దళిత సాధికారత కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు
- ఉమ్మడి మెదక్ జిల్లాలో దళిత బంధు పథకం అమలు సమావేశంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
సిద్దిపేట జనవరి 27 (ప్రజాతంత్ర బ్యూరో) : ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే విధంగా నియోజకవర్గానికి 100 కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని మొదటి విడతగా అమలు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లలను ఆదేశించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం, గ్రామాల ఎంపిక, లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలన్నారు. మార్చి 5 లోగా యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఫిబ్రవరి మొదటి వారం వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని, అనంతరం లబ్ధిదారుల పేరిట దళిత బంధు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు తెరవాలని సూచించారు. మార్చి 5లోగా గ్రౌండింగ్ అయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
పది లక్షల్లో గరిష్ఠంగా మూడు యూనిట్లు పెట్టుకొనే అవకాశం ఉందని, ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఒకే యూనిట్ పెట్టుకునే అవకాశం ఉందన్నారు.లబ్ధిదారుల ఖాతాల్లోకి 9.90 లక్షలు వెళతాయని, మరో పది వేలకు తోడు ప్రభుత్వం మరో పది వేలు కలిపి దళిత రక్షణ నిధి ఏర్పాటు చేయడం ఉంటుందన్నారు. లబ్ధిదారులు నష్టపోయిన సందర్భాల్లో కలెక్టర్ల వద్ద ఉండే ఈ నిధి అండగా ఉంటుందన్నారు. దళిత బంధు పథకం దేశంలోనే అద్భుతమైన పథకం.. దళితుల సాధికారత కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పై సమీక్ష సందర్బంగా…..ఉమ్మడి మెదక్ పరిధిలో మూడు జిల్లాల్లో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అందించే పక్రియ ప్రారంభించాలి.పెండింగ్ లో ఉన్నవి వెంటనే పూర్తి చేయాలి…అవసరమైన కనీస సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలన్నారు.పట్టణ ప్రాంతాలలో డబుల్ బెడ్ రూమ్లు అందుకున్న లబ్ధిదారుల వివరాలు ఆన్ లైన్ చేయాలి..
మెదక్- సిద్దిపేట- ఎల్కతుర్తి రహదారి విస్తరణ పై సమీక్ష
మెదక్ – సిద్దిపేట – ఎల్కతుర్తి రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అవసరమైన భూసేకరణ పనులు కలెక్టర్లు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. వీలైనంత త్వరగా టెండర్ పక్రియకు వెళ్ళాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మేల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, మాణిక్ రావు, ఒడితెల సతీష్ కుమార్, ఎఫ్డీసి ఛైర్మెన్ వంటెరు ప్రతాప రెడ్డి, జిల్లాల కలెక్టర్లు హన్మంత రావు, హరీశ్, అదనపు కలెక్టర్లు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.