- స్థానిక సంస్థల టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ యాదవరెడ్డి
- నామినేషన్ దాఖలు
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంటేరా? నిర్మలా రెడ్డా?
‘ప్రజాతంత్ర’ చెప్పిందే నిజమైంది. స్థానిక సంస్థల టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సిద్ధిపేట జిల్లా గజ్వేల్కు చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, సిఎం కేసీఆర్కు సన్నిహితుడైన డాక్టర్ యాదవరెడ్డి ఖరారయ్యారు. గజ్వేల్కు చెందిన డాక్టర్ యాదవరెడ్డికి ఎమ్మెల్సీగా ఛాన్స్ అంటూ ఈ నెల 14న ‘ప్రజాతంత్ర’ తెలంగాణ దిన పత్రికలో ‘డాక్టర్ యాదవరెడ్డికి ఎమ్మెల్సీ ఛాన్స్’ హామీ ఇచ్చిన సిఎం కేసీఆర్ అనే శీర్షికన ప్రముఖంగా వార్తను ప్రచురించిన విషయం పాఠకులకు విధితమే. ‘ప్రజాతంత్ర’ ప్రచురించినట్లుగానే టిఆర్ఎస్ పార్టీ తరపున స్థానిక సంస్థల తరపున ఉమ్మడి మెదక్ జిల్లా అభ్యర్థిగా డాక్టర్ యాదవరెడ్డి పేరును సిఎం కేసీఆర్ ఖరారు చేశారు. టిఆర్ఎస్ పార్టీ తరపున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎర్రొళ్ల శ్రీనివాస్, లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి, భూంరెడ్డి, భూపాల్రెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి తదితర నేతల పేర్లు పరిశీలనకు వొచ్చినప్పటికీ సిఎం కేసీఆర్ మాత్రం డాక్టర్ యాదవరెడ్డి పట్ల మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.
2014లో కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్లో చేరిన యాదవరెడ్డి సిఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి 2014, 2018అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు యాదవరెడ్డి కేసీఆర్ గెలుపు కోసం శాయశక్తుల పని చేయడంతో పాటు కేసీఆర్కు ప్రధాన ఎన్నికల ఏజెంటుగా పని చేసి సిఎం కేసీఆర్కు దగ్గరయ్యారు. జిల్లాలోని మంత్రి హరీష్రావుకు కూడా సన్నిహితంగా ఉండే యాదవరెడ్డి గజ్వేల్లో గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండటంతో పాటు కేసీఆర్, హరీష్రావు తనకు అప్పగించిన పని చేయడంతో గతంలోనే సిఎం కేసీఆర్ యాదవరెడ్డికి ఎమ్మెల్సీ పదవీ హామీ ఇచ్చారనీ తెలుస్తుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ దఫా స్థానిక సంస్థలలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, యాదవరెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా •రారు చేయడంతో సిఎం కేసీఆర్ను ఎవరు నమ్ముకున్నా వారికి పదవీ గ్యారంటీ అని మరోసారి రుజువైంది. ఇదిలా ఉంటే, డాక్టర్ యాదవరెడ్డి సోమవారం మెదక్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద మొదటి దఫా నామినేషన్ సెట్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంటేరా? నిర్మలారెడ్డా?
టిఆర్ఎస్ పార్టీ తరపున ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ యాదవరెడ్డి పేరు ఖరారు కావడంతో..ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనే చర్చ జోరుగా సాగుతుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి నుంచి తూర్పు నిర్మలా జగ్గారెడ్డి, గజ్వేల్ నుంచి జగదేవ్పూర్ పిఏసిఎస్ మాజీ ఛైర్మన్ వంటేరు నరేందర్రెడ్డి పేర్లు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ దఫా పోటీ చేసే తనకు అవకాశం ఇవ్వాల్సింగా జగదేవ్పూర్ పిఏసిఎస్ మాజీ ఛైర్మన్ వంటేరు నరేందర్రెడ్డి డిసిసి ప్రెసిడెంటు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని కోరినట్లు తెలుస్తుంది. పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే ఎమ్మెల్సీగా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నరేందర్రెడ్డి అంటున్నారు. మరోవైపు తన భార్య నిర్మలారెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టడంపై సంగారెడ్డి ఎమ్మెల్యే, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు జగ్గారెడ్డి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంగారెడ్డి జిల్లాలో 160, మెదక్లో 50, సిద్ధిపేటలో 18మంది సభ్యులు మాత్రమే ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి పట్టున్న సంగారెడ్డికి చెందిన నిర్మలారెడ్డిని పోటీకి దింపుతాననీ జగ్గారెడ్డి అంటే మాత్రం అధిష్టానం మాత్రం అటే మొగ్గు చూపే అవకాశం ఉండగా…కాంగ్రెస్ పార్టీకి చెందిన వోట్లన్నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పడేటట్టు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టాల్సిందిగా జిల్లా నేతలకు టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి సూచించినట్లు సమాచారం.