- అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి
- థర్డ్ వేవ్ను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
- ఐసిఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరామ్ భార్గవ
లాక్డౌన్ల ఎత్తివేత పక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఐసీఎంఆర్ సూచించింది. కొరోనా థర్డ్ వేవ్ను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ తెలిపారు. ఇందుకోసం ఆయన మూడు అంశాల ప్రణాళికను సూచించారు. తక్కువ పాజిటివిటీ రేటు, అత్యధిక మందికి టీకాలు , కొవిడ్ నిబంధనలతో కూడిన ప్రవర్తన వంటి అంశాలను రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకొని లాక్డౌన్ల సడలింపులపై నిర్ణయం తీసుకోవాలన్నారు.
ప్రతివారం పాజిటివిటీ రేటు 5శాతం కంటే తక్కువగా ఉండి.. కొవిడ్ ముప్పు అధికంగా ఉన్నవర్గాలకు 70శాతం టీకాలు వేసి.. సామాజిక బాధ్యతగా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తుంటే.. ఆ ప్రాంతాల్లో మాత్రం లాక్డౌన్లు తొలగించవచ్చన్నారు. పరీక్షలను పెంచి.. జిల్లా స్థాయిలో కంటైన్మెంట్లను ఏర్పాటు చేయడం అంత ప్రభావ వంతంగా ఉండదని చెప్పారు.
లాక్డౌన్లను అత్యంత నెమ్మదిగా సడలించాలని అభిప్రాయపడ్డారు. భార్గవ చెప్పిన సలహాలను ఇప్పటి వరకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారిక మార్గదర్శకాల్లో చేర్చలేదు. వ్యాక్సినేషన్పై బలరామ్ భార్గవ మాట్లాడుతూ.. జులై మధ్య నాటికి లేదా ఆగస్టు మొదటి వారం నాటికి దేశంలో రోజుకు కోటి మందికి టీకాలు అందించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఽటీకాలకు కొరత లేదు. ప్రస్తుతం దేశంలో అందరు టీకాలు వేయించుకోవాలనుకుంటున్నారు. దేశం మొత్తానికి ఒక్క నెలలో టీకాలు వేయలేము కదా. మన జనాభా అమెరికా జనాభా కంటే నాలుగు రెట్లు ఎక్కువ. కొంత ఓపిక పట్టాలి. జులై మధ్య నాటికి, లేదా ఆగస్టు నాటికి రోజుకు కోటిమందికి టీకాలు వేసే అవకాశం ఉంది’’ అని ఆయన తెలిపారు.
ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు దేశ వ్యాప్తంగా ఉన్న 21.39శాతం పాజిటివిటీ రేటు ప్రస్తుతం 8.3 శాతానికి తగ్గింది. మే31 నాటికి దేశవ్యాప్తంగా 344 జిల్లాల్లో 5శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు నమోదువుతోంది. మే మొదటి వారంలో ఈ స్థాయి పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల సంఖ్య 92 మాత్రమే కావడం విశేషం. దేశ వ్యాప్తంగా మే7న నాలుగు లక్షలకుపైగా కేసులు నమోదు కాగా.. బుధవారం వాటి సంఖ్య 1.32 లక్షలకు తగ్గింది.