ఇంటికో ఉద్యోగమన్నారు..ఊరికొక్కటి కూడా ఇవ్వలేదు
రానున్న రెండు పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర ఇంఛార్జ్ తమకు దిశా నిర్దిశం చేసారని రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లా నాయకులు తెలిపారు. బుధవారం గాంధీభవన్లో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ కొండవిశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ అంజాన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ… గ్రాడ్యుయేషన్ ఎన్నికల కోసం ప్రతీ కార్యకర్త వోటర్ ఎన్ రోల్ చేయించాలని కోరారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అన్నారు కానీ తెలంగాణలో ఇప్పుడు నిరుద్యోగం పెరిగిపోతోందని సర్కార్పై రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లో ఉన్న అన్ని పెద్ద సంస్థలు కాంగ్రెస్ తెచ్చినవే అని తెలిపారు. టీఆర్ఎస్ నేతలు ఏమొఖం పెట్టుకుని ఎన్నికలకు వెళ్తారని మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
టిఆర్ఎస్ బలం డబ్బు మాత్రమేనని, ప్రతీ పట్టబద్రుడు కాంగ్రెస్ పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు. టిఆర్ఎస్ సర్కార్ అరచేతిలో వైకుంఠం చూపిస్తుందని హైదరాబాద్ ప్రెసిడెంట్ అంజాన్ కుమార్ యాదవ్ విమర్శించారు. హైదరాబాద్ను ఇస్తాంబుల్ చేస్తామన్నారు, కానీ నాంపల్లిలో గల్లీలలో నాలా నీళ్లు రోడ్లపై పారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ అన్ని ఎన్నికల్లో డబ్బు తోనే గెలిచిందని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ విమర్శించారు. పట్టబద్రుల ఎన్నికలో డబ్బుకు ఆశ పడకండని, ఈ ఎన్నికల్లో మార్పు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టీఆరెస్ పార్టీ గ్రామీణ ప్రాంత ప్రజలకు మాయ మాటలు చెప్పి, డబ్బుతో వోట్లు కొనుగోలు చేస్తుందని ఏఐసీసీ కార్యదర్శి వంశీ చాంద్ రెడ్డి విమర్శించారు. పట్టబద్రుల ఎన్నికలో టిఆర్ఎస్ మాయ మాటలు నమ్మవద్దని అన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ టిఆర్ఎస్ అని, ఇంటికో ఉద్యోగం కాదు కదా..ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదవాలని కాంగ్రెస్ ఫీజు రీఎంబర్స్ మెంట్ తెచ్చిందని ఆయన గుర్తు చేశారు.