ఆలేరు సర్పంచ్, ఉప సర్పంచ్లను సస్పెండ్ చేయాలని ఆదేశించిన కలెక్టర్ శర్మన్
నాగర్ కర్నూల్, సెప్టెంబర్ 23 (ప్రజాతంత్ర విలేకరి) : అభివృద్ధి పనులు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. బుధవారం పెద్దకొత్తపల్లి మండలం లోని పెద్దకొత్తపల్లి చిన్న కొత్తపల్లి సాతాపూర్ మరియు తెల్కపల్లిమండలంలో ఆలేర్ గ్రామాల్లో కొనసాగుతున్న రైతు వేదికలను కలెక్టర్ శర్మన్ పరిశీలించారు. ఆయా గ్రామాల అధికారులు సర్పంచ్ లతో ఇంకుడుగుంతలు, పల్లె ప్రకృతి వనాలు, రైతువేదికలు, వైకుంఠధామాలు, ఎరువుల షెడ్లు, ఆన్లైన్ తరగతులపై పర్యవేక్షణ, అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెప్రకృతి వనాలను త్వరగా పూర్తి చేయాలని ఇబ్బందులుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాన్ని పరిశీలించారు. పనులు నత్తనడక సాగుతుంటే ఈ నెల 30 తేదీలోపు ఎలా పూర్తి చేస్తారని అధికారులు సర్పంచుల పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు ఇలా ఉంటే అధికారులకు కనింపించడం లేదా అని ప్రశ్నించారు. ఆలేరు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ లను సస్పెండ్ చేయాలని డిపిఓవో సురేష్ మోహన్ కు ఫోన్ ద్వారా ఆదేశించారు. గ్రామ అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట మండలస్థాయి, గ్రామస్థాయి అధికారులు గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.