- దేశ వ్యాప్తంగా పది వేల కేంద్రాలలో వ్యాక్సినేషన్
- గాంధీ దవాఖానాలో టీకా వేయించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి మంగళవారం కోవిడ్ టీకా వేయించుకున్నారు. హైదరాబాద్లోని గాంధీ దవాఖానాలో ఆయన తొలి డోసు టీకా తీసుకున్నారు. 60 ఏళ్లు దాటిన వారికి దేశవ్యాప్తంగా ఉచిత టీకా పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. దీర్ఘకాల వ్యాధులు ఉన్న 45 ఏళ్లు దాటిన వారికి కూడా కోవిడ్ టీకా ఇస్తున్నారు. కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రభుత్వ దవాఖానల్లో టీకాలు ఇస్తున్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీకా తీసుకునే సమయంలో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ కూడా అక్కడే ఉన్నారు. హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ టీకాను ఆయన వేయించుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..కొరోనా టీకా తీసుకునేందుకు ఎవరూ భయపడవద్దని తెలిపారు. రెండవ దశ వ్యాక్సినేషన్ సోమవారం ప్రారంభం అయ్యిందని…ప్రధాని కూడా తీసుకున్నారని తెలిపారు. 60 ఏళ్ళు పైబడిన వారు, 45 ఏళ్ల పైబడిన దీర్ఘకాలిక వ్యాధుల వారికి టీకాను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ ఉంటుందని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవొచ్చన్నారు.
ప్రభుత్వ సెంటర్స్లో ఉచితంగా టీకా వేసుకోవొచ్చని, ప్రైవేట్లో డోస్ రూ.250 ఉంటుందన్నారు. 250 రూపాయిలు మించి ఇవ్వవొద్దని స్పష్టం చేశారు. రూ.250 మించి హాస్పిటల్స్ కూడా తీసుకోకూడదని ఆయన ఆదేశించారు. దేశ వ్యాప్తంగా 10 వేల కేంద్రాలలో వ్యాక్సినేషన్ ప్రారంభమైందని తెలిపారు. ప్రభుత్వ కేంద్రాలను 20 వేలకు పెంచుతామన్నారు.
రాష్ట్రంలో 91 కేంద్రాలలో వ్యాక్సిన్ ప్రారంభించామని చెప్పారు. మంత్రి ఈటల కూడా వ్యాక్సిన్ తీసుకున్నారన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ రోజే మొదటి కేస్ నమోదైందని తెలిపారు. గాంధీ టీం సంవత్సరం నుంచి నుంచి చాలా కష్టపడిందంటూ గాంధీ టీమ్కు సెల్యూట్ చేశారు. వారి సేవకు ఫలితాలు కనిపిస్తున్నాయని అంటూ కిషన్రెడ్డి కొనియాడారు.