- జాప్యం లేకుండా కారుణ్య నియామకాలు
- కలెక్టర్లకు సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశం
జిల్లా స్ధాయిలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న వివిధ క్యాటగిరీలలో ఉద్యోగుల ప్రమోషన్ల పక్రియను జనవరి 31 లోగా పూర్తి చేయడంతో పాటు, ఎటువంటి జాప్యం లేకుండా కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం బిఆర్కెఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో అన్ని క్యాటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్లు, డిపిసిలు, నిర్వహణ కారుణ్య నియామకాలు, రెవెన్యూ సంబంధిత అంశాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠదామాలు, సెగ్రిగేషన్ షెడ్స్, డ్రైయింగ్ ఫ్లాట్ ఫామ్స్, గ్రామ నర్సరీలు, ఉపాధి హామీ పనులు తదితర అంశాలపై సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఉద్యోగుల ప్రమోషన్ల పక్రియకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని, జిల్లా కలెక్టర్లు ఈ అంశంపై వెంటనే జిల్లా స్ధాయిలో సమావేశం నిర్వహించి ప్రమోషన్ల ద్వారా నింపే ఉద్యోగ ఖాళీల సంఖ్యను అంచనా వేయాలన్నారు. ప్రతి సోమవారం ప్రమోషన్ల, కారుణ్య నియామాకాలపై సమావేశాలు నిర్వహించి ఈ నెల 24 నాటికి పూర్తి చేయాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధి హామీ ద్వారా ఈ సీజన్లో మూడు నెలల ముందుగానే 14.10 కోట్ల పని దినాలు దాటినందుకు అధికారులను అభినందిస్తూ వొచ్చే 3 నెలల కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. రైతు వేదికలు, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠదామాలు, డ్రైన్ ప్లాట్ ఫామ్స్, సెగ్రిగేషన్ షెడ్స్, నర్సరీలలో ప్లాంటేషన్ తదితర అంశాలకు ప్రాధాన్యత నిచ్చి పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు, జిఎడి ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ఏఎమ్ రిజ్వి, సి.ఎం కార్యదర్శి శేషాద్రి, సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, యండి, టిఎస్టిఎస్ జి.టి వెంకటేశ్వర్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.