ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాల తర్వాత మమత పిలుపు
కాంగ్రెస్తో కలసి పోరాడేందుకు దీదీ గ్రీన్ సిగ్నల్
కోల్కతా, మార్చి 11 : ఉప్పు నిప్పుగా ఉన్న తృణమూల్, కాంగ్రెస్ పార్టీలు రెండూ జత కట్టనున్నాయా? వొచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రెండు కలిసి పోటీ చేస్తాయా? ఈ విషయంపై బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పరోక్ష సంకేతాలిచ్చారు. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు దగ్గరయ్యే ఛాన్స్ ఉందని ఆమె పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓకే చెబితే..పొత్తుకు సిద్ధమే అని ప్రకటించారు. బీజేపీని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిందేనన్నారు. ‘ఒకవేళ కాంగ్రెస్ ఓకే చెబితే..అందరం కలిసి సార్వత్రిక ఎన్నికల్లో అందరం కలిసి పోటీ చేద్దాం. ఇప్పుడే వొచ్చిన తొందరేవి• లేదు. పాజిటివ్గానే వుండండి. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకీ పెద్ద నష్టమే.
బీజేపీని ఓడించాలంటే అందరమూ ఐక్యం కావాల్సిందే. అయితే మాకు మేమే ఆఫర్లు ఇవ్వం. కాంగ్రెస్ అడిగితే ఓకే చెబుదాం. రానూ రానూ కాంగ్రెస్ విశ్వసనీయతను కోల్పోతుంది. దానిపై మాత్రం ఆధాపడం’ అని మమత నర్మగర్భంగానే మాట్లాడారు. కొన్ని రోజులుగా తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని రోజుల క్రితం కేంద్రంలో ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన అన్ని పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తృణమూల్ను సోనియా గాంధీ ఆహ్వానించలేదు. ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. ఆ తర్వాత గోవా ఎన్నికల్లో కూడా కలిసి రావాలని మమతకు కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. అయితే దీనిని మమత నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.