జంటనగరాల్లో ఆలయాకు కొత్త శోభ
కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికిన ప్రజలు దైవ దర్శనం కోసం ఆలయాలకు పోటెత్తారు. కొరోనా పీడను వొదిలించాలని కోరుకుంటూ ఆలయ దర్శనం చేసుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలూ భక్తులతో కిటకిటలాడాయి. కుటుంబసభ్యులతో కలిసి విద్యార్థులు, యువత దైవ దర్శనం చేసుకుని కొత్త ఏడాదిలో అంతా మంచే జరగాలని ప్రార్థించారు. నూతన సంవత్సరం నేపథ్యంలో యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటల సమయంలో, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. ఆలయ అధికారులు భక్తులకు లఘు దర్శనం కల్పిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించ లేదు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతినిచ్చారు.
హైదరాబాద్తో పాటు యాదాద్రి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామిని దర్శించుకోటానికి భక్తులు పోటెత్తడంతో క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయానికి తరలివొచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కొత్త ఏడాది అంతా మంచే జరగాలని వేడుకున్నారు. చిక్కడపల్లి, హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్ వేంకటేశ్వరాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. పరస్పరం ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. భక్తులు మాస్కులు ధరించి ఆలయాలకు తరలివొచ్చారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారులు ఇలా వివిధ రంగాలకు చెందిన వారంతా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నగరవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ పెరిగింది. చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ప్రదక్షిణలు నిలిపివేసి నేరుగా దర్శనం కల్పించారు. డిడి కాలనీ అ•బిల నారసింహ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చిన్నాచితక ఆలయాల్లో కూడా భక్తులు పోటెత్తారు.